హైదరాబాద్ : రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు రైతు బంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి (Minister Niranjan Reddy) వెల్లడించారు. రైతు బంధు 11వ విడతలో రూ.7624.74 కోట్లను రైతుల ఖాతాల్లో జమా చేశామని అన్నారు. రాష్ట్రంలోని 68.99 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాలకు పంపిణీ చేశామని వివరించారు.
అత్యధికంగా నల్లగొండ (Nallagonda) జిల్లాలో 5 లక్షల 8756 మంది రైతులకు రూ.609.67 కోట్లను అత్యల్పంగా మేడ్చల్ (Medchal) మల్కాజిగిరి జిల్లాలో 35,879 మంది రైతులకు రూ.33.60 కోట్లు జమా చేశామని తెలిపారు. తెలంగాణలో రైతును రాజును చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ (CM KCR) ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పూర్తిచేస్తున్నామని అన్నారు.
రైతుబంధు (Raitu Bandu) మొదలుపెట్టినప్పుడు ఎన్నికల కోసం అని విమర్శించిన వారి నోళ్లు మూయించేలా 11వ విడత రైతుబంధు విజయవంతంగా పూర్తిచేసుకున్నామని వివరించారు. మొత్తం ఇప్పటి వరకు రూ.72,815.09 కోట్లు నేరుగా రైతుల ఖాతాలలోకి జమా అయ్యాయని మంత్రి స్పష్టం చేశారు. స్వంతంత్ర భారత చరిత్రలో ఇది ఒక రికార్డు అని, అన్నదాతల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలుస్తారని అన్నారు.
అన్నం పెట్టే అన్నదాతకు ఆసరాగా నిలవాలన్నదే కేసీఆర్ తపన అని పేర్కొన్నారు. దేశంలో ఉచిత కరంటు, సాగునీరు, రైతుబంధు, రైతబీమా పథకాలతో పాటు వంద శాతం పంటలు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. సందర్భంగా రాష్ట్ర రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.