యాసంగిలో వేరుశనగతో పాటు ఇతర నూనె పంటలు సాగు చెయ్యాలి
ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించండి
క్షేత్రస్థాయిలో పంటల నమోదు పక్కాగా ఉండాలి
వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశం
హైదరాబాద్ : సాగు విధానంలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. కేవలం వరి పంటనే కాకుండా అన్ని రకాల పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని కోరారు. ఈ మేరకు పంటల కొనుగోలు, వానాకాలం సాగు ఇతర అంశాలపై బుధవారం వ్యవసాయ శాఖ కమిషనరేట్లో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… యాసంగి సీజన్లో వేరుశనగతో పాటు ఇతర నూనె గింజల పంటలు సాగు చేయాలని వీటితో పాటు పప్పు ధాన్యాలు సాగు చేయాలని సూచించారు. అయితే, రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లీంచేందుకుగానూ రైతు వేదికల్లో ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇతర పంటల సాగుపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వేరుశనగ విత్తనాలను సబ్సిడీలో ఇచ్చే అవకాశాలను వెంటనే పరిశీలించి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇక ఈ వానాకాలం సీజన్కు సంబంధించి పంటల లెక్క పక్కాగా ఉండాలన్నారు. గతంలో రైతు వారిగా పంటలను లెక్కించగా ఈసారి మరింత ఖచ్చితత్వం కోసం సర్వే నంబర్ల వారిగా లెక్కిస్తున్నట్లు తెలిపారు. పంటల నమోదు ప్రక్రియ మరో పది రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.