హైదరాబాద్ : ప్రజా జీవితంలో ఉండేవాళ్లు, ఉండాలనుకునే వాళ్లు పని చేసి ప్రజల ఆదరణ పొందాలి. కానీ రాజకీయ ప్రత్యర్ధులపై భౌతిక దాడులకు పాల్పడాలి అనుకోవడం, హత్యా రాజకీయాలకు కుట్రలు చేయడం సరికాదని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేసిన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత ఏడేండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి నిజానిజాలు ప్రజలకు వెల్లడించాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు.
రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇవాళ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపాకు నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. జితేందర్ రెడ్డి డ్రైవర్తో పాటు ఆయన పీఏను కూడా పోలీసులు విచారించనున్నారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డి పాత్రపై కూడా విచారణ చేపట్టనున్నారు. మంత్రి హత్య కుట్ర కేసులో నిందితులకు జితేందర్ రెడ్డి పీఏ, డ్రైవర్ ఆశ్రయం ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నిన ఐదుగురు నిందితులను చర్లపల్లి జైలుకు సైబరాబాద్ పోలీసులు తరలించారు.