హైదరాబాద్ : రైతుబంధు పథకం నిధుల విడుదలపై ఆంధ్రజ్యోతి పత్రిక కథనాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రైతుబంధుపై అక్కసు ఎందుకు? అని ప్రశ్నించారు. మీడియా మితిమీరిన ధోరణి సరికాదు అని నిరంజన్ రెడ్డి అన్నారు.
ఈ మేరకు నిరంజన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. డిసెంబరు 28 నుండి జనవరి 18 వరకు రైతుబంధు పథకం కింద నిధులు రైతుల ఖాతాలలో జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. దానికి అనుగుణంగా ప్రతి రోజు నిధులు రైతుల ఖాతాలలో జమచేయడం జరుగుతున్నది. ఇప్పటి వరకు నాలుగు ఎకరాల వరకు ఉన్న 54 లక్షల 70 వేల 637 మంది రైతుల ఖాతాలలో రూ. 4327.93 కోట్లు జమ చేయడం జరిగింది. రైతుబంధు నిధులు జమ చేయడం ప్రారంభించి ఎనిమిది రోజులు అయ్యింది కాబట్టి ఎనిమిది ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలలో పడాల్సిందే అని ఆంధ్రజ్యోతి ఊహించుకుని ఊహాజనిత కథనాలు రాసి రైతులను గందరగోళానికి గురిచేయాలనుకోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఎనిమిది ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలలో నిధులు జమచేసినట్లు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఏ రోజు ఎంత మంది రైతుల ఖాతాలలో నిధులు జమ చేశామో అదే మీడియాకు విడుదల చేయడం జరుగుతున్నది. నిధుల కొరత ఉన్నా, కేంద్రం వివిధ రకాలుగా తెలంగాణ పథకాలను అడ్డుకునే ప్రయత్నం చేసినా, కరోనా విపత్తు వచ్చినా గత 9 విడతలుగా రైతుబంధు పథకాన్ని విజయవంతంగా అమలుచేసిన చిత్తశుద్ధి తెలంగాణ ప్రభుత్వానిది. పదో విడత రైతుబంధు నిధులు కూడా విజయవంతంగా రైతుల ఖాతాలలో జమచేయడం జరుగుతున్నది.
అరకొర సమాచారం, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న అత్యుత్సాహం సరికాదు. కనీస సమాచారం, వివరణ తీసుకోకుండా వార్తను ప్రచురించడం అంటే కేవలం ప్రభుత్వ పథకాల మీద బురదజల్లాలన్న ఆలోచన ఉన్నట్లు అర్దమవుతున్నది. గత యాసంగి సీజన్లో కూడా డిసెంబరు ఆఖరులో మొదలుపెట్టి సంక్రాంతి వరకు జమచేయడం జరిగింది. ఈ సారి కూడా గత యాసంగి మాదిరిగా రైతుబంధు నిధులు జమచేయడం జరుగుతున్నది అని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.