హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్రావు తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే తక్షణమే రాజీనామా చేస్తానని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సవాల్ చేశారు. ఈ నెల 27 తర్వాత తన వ్యవసాయ క్షేత్రానికి రాష్ట్ర మీడియా ప్రతినిధులను తీసుకెళ్తానని, రఘునందన్రావు కూడా రావొచ్చని చెప్పారు. అక్రమాలకు పాల్పడలేదని గట్టుకాడిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణం చేస్తానని, రఘనందన్ తప్పు తెలుసుకుంటే చాలని చెప్పారు. ఆరోపణలను నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రఘనందనన్రావు చేసిన ఆరోపణలపై ఉద్వేగానికి గురయ్యారు. పానగల్లోని తన ఇల్లు తీసుకుని రూ.4 కోట్లు ఇచ్చినా లేదా హైదరాబాద్లోని రఘనందన్రావు ఇల్లు ఇచ్చినా వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పారు. తన భూముల గురించి మాట్లాడుతున్న రఘనందన్రావు.. హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ వనపర్తి, మణికొండ బ్రాంచీల్లో తీసుకున్న రుణాలను కడుతారా? అని ప్రశ్నించారు. బ్యాంకు రుణాలతో వ్యవసాయం భూములు, వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేశామని స్పష్టంచేశారు. తనకు వ్యవసాయం అంటే ప్రాణమని, అందుకే ఉమ్మడి పాల మూరులో భూములు కొనుగోలు చేశానని వివరించారు.
ఆర్డీఎస్ ఎక్కడ ఉన్నదో తెలుసా?
రఘనందన్రావుకు ఆర్డీఎస్, కృష్ణానది ముంపు ఎక్కడ ఉన్నదో అవగాహన లేదని నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు. చండూరులోని సర్వే నంబర్ 60 తన అధీనంలో ఉన్నదనడంలో వాస్తవం లేదని స్పష్టంచేశారు. సర్వేనంబర్ 60లో ఉన్నది శ్రీశైలం ముంపు భూము లని ఆర్డీఎస్వి కాదని చెప్పారు. సర్వే నంబర్ 60లో 3 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేశామని, అమ్మిన రైతు ద్వారా వాస్తవాలు తెలుసుకోవచ్చని సూచించారు. ఫాంహౌస్ చుట్టూ కొంతమేర మాత్రమే గోడ కట్టామని, మిగిలింది ఫెన్సింగ్ చేశామని వివరించారు. ఫాంహౌస్ భూములు రెండు గ్రామాల పరిధిలో ఉన్నాయని వెల్లడించారు. మానవపాడు తహసీల్దార్ ఆఫీసుల్లో రికార్డులు దగ్ధం కావడాన్ని ఈ భూములకు లింకుపెట్టడం నీచమన్నారు. చండూరు భూముల్లో శాశ్వత నిర్మాణాలు లేవని, కూలీలు, బర్రెలు, ఆవులు, గొర్రెలు, ట్రాక్టర్ షెడ్లు మాత్రమే ఉన్నాయన్నారు. ఆరోపణలు వచ్చిన మరుసటి రోజే 29 మంది మీడియా ప్రతినిధులు చండూరు క్షేత్రాన్ని పరిశీలించారని చెప్పారు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రెవెన్యూ భూరికార్డులు డిజిటలైజ్ అయ్యాయనే విషయం కూడా తెలియకపోవడం రఘునందన్ అజ్ఞానానికి నిదర్శమని ఎద్దేవా చేశా రు. సర్వే ఖర్చులు తామే భరిస్తామని, రఘునందన్రావు ఎప్పుడు వస్తారో చెప్పాలని సవాల్ చేశారు.
సొంత నిధులతోనే రోడ్డు
చండూరు భూములను అమెరికాలో ఉంటున్న తన బిడ్డ కొనుగోలు చేసిందని, కరోనా సమయంలో రిజిస్ట్రేషన్కు రాలేకపోవడంతో గౌడనాయక్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి, ఆ తరువాత తన బిడ్డ పేరు మీదకు మార్చుకున్నట్టు నిరంజన్రెడ్డి వివరించారు. గౌడనాయక్ను తామే పెంచి, చదువులు చెప్పించామని, అతడు తమ ఇంటి మనిషినేనని స్పష్టంచేశారు. చండూరులో కొనుగోలు చేసిన భూమి సురవరం ప్రతాపరెడ్డి వంశస్థులదని చెప్పారు. చండూరు భూములకు 60, 70 మంది రైతు లు, ఒక కంపెనీ యజమాని కలిసి సొంత నిధులతోనే రోడ్డు వేయించుకున్నట్టు వివరించారు. ప్రభుత్వ నిధులను వాడుకోలేదని స్పష్టంచేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఒండ్రు మట్టిని తరలించామని తెలిపారు.
పథకం ప్రకారమే బీఆర్ఎస్ నేతలపై దుష్ప్రచారం
రాష్ట్రంలో ఒక పథకం ప్రకారమే సీఎం కేసీఆర్పై, బీఆర్ఎస్ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారని నిరంజన్రెడ్డి విమర్శించారు. న్యాయవాద వృత్తిలో తాను రారాజునని, 33 ఏండ్ల క్రితమే వనపర్తిలో ఇల్లు నిర్మించుకున్నానని చెప్పారు. న్యాయవాద వృత్తిలోకి వచ్చిన రెండేండ్లలోనే ఇన్కం ట్యాక్స్ చెల్లించే స్థాయి కి ఎదిగానని తెలిపారు. తన భార్య కూడా ఇన్కం ట్యాక్స్ చెల్లిస్తున్నదని వెల్లడించారు. రఘనందన్రావుకు ప్రత్యేకంగా తప్పుడు ఆరోపణలు చేయాలని టాస్క్ ఇచ్చారా? అనే అనుమానం వ్యక్తంచేశారు. రఘనందన్రావు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ రాజావరప్రసాద్రావు, బీఆర్ఎస్ నేతలు రూప్సింగ్, గట్టు యాదవ్, పటేల్ విష్ణువర్ధన్రెడ్డి, మోదల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.