హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సీఎం కేసీఆర్ చేసిన మంచి పనులు వంద ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ఒక్క మంచి పనైనా ఉన్నదా? అని ప్రశ్నించారు. ఎనిమిదేండ్ల కాలంలో దేశంలోని పేదలకు, రైతులకు మోదీ చేసిందేమీ లేదన్నారు. సీఎం కేసీఆర్.. తెలంగాణలో రైతుల గోస, పేదల ఆకలి తీర్చిండని కొనియాడారు. ఆదివారం మహారాష్ట్రంలోని థాణె, గోరై బొరివళిలో ఉంటున్న వనపర్తి గిరిజనులతో సమావేశమయ్యారు. మంత్రికి గిరిజన ఆడబిడ్డలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ గిరిజనుల, తండాల అభివృద్ధి కోసం ఎంతో చేశారని తెలిపారు. రాష్ట్రంలో తండాల రూపు మారిందని, గిరిజనుల బతుకు మారిందని అన్నారు.
తండాలను పంచాయతీలుగా మార్చడం, రహదారుల ఏర్పాటు, ఎత్తిపోతల పథకం తేవడం, తాగునీటి ఇబ్బందులు తొలిగిపోవడం, సాగు నీళ్లు రావడంతో వలసలు తగ్గి తండా వాసులంతా వారి వారి తండాల్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు. ముంబైలో ఉంటున్న వారికి తెలంగాణ మాదిరిగా ఎవరికన్నా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వంటివి అందుతున్నాయా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాకతో తండాల్లో గిరిజనుల ఆర్థికశక్తి పెరిగిందని, వ్యవసాయం బలపడిందని తెలిపారు. తాను చదువుకొనే రోజుల్లో తనతోపాటు ఒక గిరిజన విద్యార్థి కూడా లేడని, కానీ ఇప్పుడు తండాల్లో చదువుకోని విద్యార్థి ఎవరూ లేరని చెప్పారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 70% నెరవేర్చినట్టు చెప్పారు. మిగతా నియోజకవర్గాలకు భిన్నంగా అధిక సంఖ్యలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించినట్టు వెల్లడించారు.
పంద్రాగస్టు తర్వాత కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు అందిస్తామన్నారు. 70 తండాలకు ఇప్పటికే రహదారులు నిర్మించామని, మరో 20 రహదారుల నిర్మాణం త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వనపర్తి నుంచి ముంబైకి బస్సు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. వనపర్తిలోని 108 తండాలకు రహదారులను నిర్మించే బాధ్యత తనదేనన్నారు. ముంబైలో వనపర్తి వాసుల కోసం ఒక భవన నిర్మాణానికి సహకరిస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా బంజారా భాషలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డిపై గోపాల్ పాడిన పాట అందరినీ కదిలించింది. తెలంగాణలో అమలవుతున్న పథకాలపై మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ కృష్ణ నాయక్, జడ్పీటీసీ సామ్యానాయక్, ఎస్టీ సెల్ అధ్యక్షులు జాతృనాయక్, శేఖర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.