హైదరాబాద్, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): దేశంలో రైతురాజ్యం రావాలని, రైతే పాలకుడు కావాలని, దేశ ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. బీజేపీది రైతు వ్యతిరేక పాలన అని, దేశ గతిని, వ్యవసాయరంగ పరిస్థితిని మార్చేందుకే బీఆర్ఎస్ పుట్టుకొచ్చిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి కార్పొరేట్ వ్యక్తులు ప్రాధాన్యమైతే, తమ ప్రభుత్వానికి వ్యవయసాయరంగమే ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. దేశ వ్యవసాయరంగానికి తెలంగాణ దిక్చూచిగా మారిందన్నారు. ఈ మేరకు శనివారం శాసనసభలో వ్యవసాయశాఖ పద్దుపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. దేశంలో వ్యవసాయరంగం వెనక్కి వెళ్తుంటే, తెలంగాణలో మాత్రం పురోగమిస్తున్నదని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జీఎస్డీపీ వాటా 1.9 శాతం పెరిగితే, దేశంలో 0.1 శాతం తగ్గిందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పదేండ్లలో వ్యవసాయం, అనుబంధం రంగాలకు కేవలం రూ.7,994 కోట్లు ఖర్చు పెడితే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు రూ.1.91 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. ఇక విత్తనరంగంలో దేశానికి తెలంగాణ కేరాఫ్గా మారిందని వెల్లడించారు.
దేశ వ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని మంత్రి ఆరోపించారు. ఇందులో భాగంగానే నల్ల చట్టాలను తీసుకొచ్చిందని చెప్పారు. అధికారంలోకి వస్తే పంటలకు స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ, అధికారంలోకి వచ్చాక వాటి అమలు సాధ్యం కాదని చెప్పటాన్ని తప్పు పట్టారు. రైతుల ఆదాయంపై పన్ను వేయాలని కేంద్రం ఆలోచన చేయడం దుర్మార్గమని విమర్శించారు.
ఎన్నికల హామీల్లో, 2014, 2019 మ్యానిఫెస్టోలలో బీజేపీ పేర్కొన్న వాటిలో ఒకటంటే ఒకటి కూడా నెరవేర్చలేదని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. లక్ష కోట్లు పెట్టి రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వడం సాధ్యం కాదన్న కేంద్రం, దేశంలో ఇప్పటి వరకు రూ.19 లక్షల కోట్ల కార్పొరేట్ల రుణాలను రద్దు చేసినట్టు వెల్లడించారు.
తలసరి విద్యుత్తు వినియోగంలో దేశంలో తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందని నిరంజన్రెడ్డి తెలిపారు. మొత్తం విద్యుత్తు వినియోగంలో 37 శాతం వ్యవసాయరంగం వినియోగించుకుంటున్నదని చెప్పారు. తెలంగాణ కన్నా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో వ్యవసాయ పంపుసెట్లు అధికంగా ఉన్నప్పటికీ అక్కడ మొత్తం విద్యుత్తులో వ్యవసాయానికి 10శాతం మాత్రమే వినియోగిస్తున్నారని తెలిపారు. ఉచిత విద్యుత్తులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా వివిధ రాష్ర్టాల్లో విద్యుత్తు సరఫరా విధానాలను వివరించారు.