ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నందుకా?
700 మంది రైతులను బలిగొన్నందుకా?
ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచినందుకా?
కేంద్రంపై మంత్రి నిరంజన్రెడ్డి ధ్వజం
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ ఏం సాధించారని విజయ సంకల్ప సభ నిర్వహిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. గత ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఏం చేశారని, ఏ ముఖంతో ఇక్కడ సభలు నిర్వహిస్తున్నారని గురువారం ఆయన నిలదీశారు.
ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నందుకా? రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చి 700 మంది రైతుల ప్రాణాలను బలిగొన్నందుకా? వ్యవసాయ వ్యతిరేక విధానాలతో, ఎరువులు, డీజిల్ ధరలు పెంచి రైతుల నడ్డి విరిచినందుకా? నల్లధనం తీసుకొచ్చి ఒక్కో పౌరుడి ఖాతాలో రూ.15 లక్షల జమ చేస్తానని చెప్పి మోసం చేసినందుకా? నోట్ల రద్దుతో సామాన్యుల నడ్డి విరిచినందుకా? కరోనా కష్టకాలంలో వలస కూలీలను, పేదలను గాలికి వదిలి చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి అన్నందుకా? కరోనా విపత్తులో ఆఖరుకు ఆక్సిజన్ కూడా అందుబాటులో లేకుండా చేసి పేదల ప్రాణాలను పణంగా పెట్టినందుకా? దేశంలో పేదల రుణాలపై వడ్డీ భారం మోపుతూ కార్పొరేట్ల రుణాలు రూ.11 లక్షల కోట్లు మాఫీ చేసినందుకా? ఎనిమిదేండ్లలోనే రూ.100 లక్షల కోట్లు అప్పు చేసినందుకా?.. ఎందుకు విజయ్ సంకల్పమో చెప్పాలని డిమాండ్ చేశారు.