హైదరాబాద్ : వ్యవసాయంలో విత్తనమే కీలకమని, అది బాగుంటేనే రైతులకు అధిక ఆదాయం చేకూరుతుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. రాజేంద్రనగర్లోని తెలంగాణ రాష్ట్ర అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రంలో అంతర్జాతీయ స్థాయి విత్తన పరీక్ష వర్క్షాప్ను సోమవారం మంత్రి ప్రారంభించారు. విత్తన పరిశ్రమకు సేవలు అందించేందుకు రాష్ట్రంలో అత్యాధునిక టెక్నాలజీతో విత్తన పరీక్ష ల్యాబ్ను ఏర్పాటు చేయడం, దేశంలో అంతర్జాతీయ విత్తన పరీక్ష వర్క్షాప్ను నిర్వహించడం అభినందనీయమన్నారు.
సీఎం కేసీఆర్ వ్యవసాయరంగానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు దేశానికే ఆదర్శవంతమైన విధానాలను అమలు చేస్తున్నారన్నారు. వ్యవసాయంలో విత్తనాన్ని ప్రాధాన్యత అంశంగా భావించి.. విత్తన రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలకు ఇలాంటి అంతర్జాతీయ స్థాయి వర్క్షాప్ల ద్వారా ఇచ్చే శిక్షణ విత్తన రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. వ్యవసాయ కార్యదర్శి రఘునందన్రావు మాట్లాడుతూ.. ఇస్టా విత్తన పరీక్ష ల్యాబ్ లో అత్యాధునిక టెక్నాలజీ తో విత్తన పరీక్ష చేసే యంత్రాలను నెలకొల్పడం జరిగిందన్నారు.
ఈ అవకాశాన్ని ఇండియా నుంచి మరియు ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతర్జాతీయ విత్తన నిపుణులు ఎడ్డీ గోల్డ్ శాగ్ (సౌత్ ఆఫ్రికా) మాట్లాడుతూ.. తెలంగాణలో నాణ్యమైన విత్తనోత్పత్తికి మంచి అవకాశాలున్నాయన్నారు. కార్యక్రమంలో ఎడ్డి గోల్డ్ షాగ్(సౌత్ ఆఫ్రికా), విత్తన స్వచ్ఛత పరీక్షలో అనుభవజ్ఞులైన సిల్వీ దోకర్నూ (ఫ్రాన్స్), విత్తన మొలక పరీక్షలో అనుభవజ్ఞులైన సూ కసిన్స్ (న్యూజిల్యాండ్) తదితర అంతర్జాతీయ స్థాయి విత్తన ప్రముఖులచే ఇండియాతో పాటు టాంజానియా, కెన్యా, ఇండోనేషియా, డెన్మార్, సౌత్ కొరియా, నైజీరియా, ఆస్ట్రేలియా, సెనిగల్ దేశాలకు చెందిన 25 మంది ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ, ఇస్టా అధ్యక్షుడు కేశవులు, ఇస్టా సెక్రెటరీ జనరల్ ఆండ్రియాస్ వైస్ (స్విట్జర్లాండ్), ఇండో-జర్మన్ ప్రాజెక్ట్ టీం లీడర్ ఎకెహార్డ్ షోడర్ (జర్మనీ), విత్తన నమూనాల సేకరణ అనుభవజ్ఞుడు ఎడ్డీ గోల్డ్ శాగ్ (సౌత్ ఆఫ్రికా), ఇస్టా విత్తన జెర్మినేషన్ కమిటీ సభ్యులు సిల్వీ డోకర్నూ (ఫ్రాన్స్), విత్తన పరీక్ష కమిటీ సభ్యులు సూయి కసిన్స్ (న్యూజీల్యాండ్) పాల్గొన్నారు.