Minister Niranjan Reddy | వనపర్తి చరిత్రలోనే ఇదో సుదినమని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆశీసులతో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలు, రహదారుల విస్తరణ పూర్తి చేసినట్లు చెప్పారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జేఎన్టీటీయూ ఇంజినీరింగ్ కళాశాల, వసతిగృహ నిర్మాణానికి భూమిపూజ, ఐటీఐ కళాశాల, మహిళా బీసీ గురుకుల కళాశాల (వ్యవసాయ)కు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ పోతుగంటి రాములతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో 1,030 గురుకుల పాఠశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. గురుకులాలను ఏటా జూనియర్, డిగ్రీ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నామన్నారు.
సీఎం కేసీఆర్ కేసీఆర్ 16 జిల్లాల్లో ఇటీవల బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశారన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే కోర్సులు ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని, అందుకే మహిళా బీసీ గురుకుల కళాశాలలో ప్రత్యేకంగా వ్యవసాయ విద్యను అందించడం జరుగుతుందన్నారు. ఉన్నత విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదన్నది ప్రభుత్వ ఆలోచన అని, భవిష్యత్లో వనపర్తి వాసులు ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో ఉండాలన్నది తన ఆకాంక్ష అని మంత్రి అన్నారు. వివిధ విద్యా సంస్థల ఏర్పాటుకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రులు సబిత, గంగుల కమలాకర్కు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో గతవానాకాలం సీజన్లో 1.46కోట్ల ఎకరాలకు రైతుబంధు అందించామని, అత్యధికశాఖ రైతులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే అందుతుందన్నారు. వనపర్తి వ్యవసాయ కళాశాల కోసం 70 ఎకరాల భూమి అవసరమని, మొదటి దశలో 35 ఎకరాలు అవసరమన్నారు. మెడికల్, ఇంజినీరింగ్, నర్సింగ్ తదితర విద్యాసంస్థల కోసం అక్రమార్కుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకువచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతు, బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్య భట్టు, రిజిస్ట్రార్ సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.