హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): బియ్యం సేకరణలో భాగంగా ఎఫ్సీఐ తెలంగాణకు రూ.377 కోట్లు బాకీ పడిందని, ఇప్పటికీ ఆ మొత్తాన్ని ఇవ్వటం లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. పంట కొనుగోలు విషయంలో కేంద్రానికి దయాదాక్షిణ్యాలేవీ లేవని, రైతాంగాన్ని కాపాడుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వ మే పంట కొనుగోలు చేస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు.
2020 -21లో రబీలో 51.71 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయ గా, కేంద్రం తీరు వల్ల 2021-22 రబీలో 35.82 లక్షలకు పడిపోయిందని వివరించారు. వరి పంట ఉత్పత్తి 1.22 కోట్ల టన్నుల నుంచి 77.72 లక్షల టన్నులకు తగ్గిపోయిందని వెల్లడించారు. ఇటీవలే 2022-23 యాసంగికి వరి ఉత్పత్తి, సేకరించే పరిణామ అంచనాలను కేం ద్రానికి సమర్పించామని తెలిపారు. జాతీయం గా సేకరించే వరిధాన్యంలో తెలంగాణ వాటా 15 శాతమని వివరించారు.
ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని, ఈ ఏడాది 61 వేల ఎకరాల్లో ఆయిల్పాం సాగుచేశామని చెప్పారు. మార్చి వరకు లక్ష ఎకరాలు సాగులోకి తెస్తామని పేర్కొన్నారు. కల్తీ విత్తనాలపై ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు బదులిస్తూ ఇప్పటి వరకు 16 పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశామని చెప్పారు. వ్యవసాయ వర్సిటీకి వీసీని నియమించాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కోరగా త్వరలోనే నియమిస్తామని, పల్లి పరిశోధ న కేంద్రాన్ని సైతం ఏర్పాటుచేస్తామని చెప్పారు.
సైబర్ సెక్యూరిటీ బ్యూరో : హోం మంత్రి
రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు కొ త్తగా సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశామని హోం మంత్రి మహమూద్ అలీ మండలిలో ప్రకటించారు. ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, శేరి సుభాష్రెడ్డి, మీర్జా రియాజుల్ హసన్ ఎఫెండీ, గంగాధర్ అడిగిన ప్రశ్నకు హోం మంత్రి బదులిస్తూ.. సైబర్ నేరాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 10,687 సీసీటీవీ కెమెరాలు, నేను సైతంలో భాగంగా 4.79 లక్షలు, హైదరాబాద్ సిటీ సర్వైలెన్స్ ప్రాజెక్ట్లో భాగంగా 4 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. రోడ్ల అభివృద్ధి, సిగ్నలింగ్ వ్యవస్థతో వాహనాల వేగం 22 కిలోమీటర్ల నుంచి 27 కిలోమీటర్లకు పెరిగిందని వెల్లడించారు.
కేంద్రమంత్రి తప్పడు సమాచారం: సత్యవతి
గిరిజన వర్సిటీపై కేంద్ర విద్యాశాఖ మంత్రి తప్పుడు సమాచారమిచ్చారని, పూర్తి అవగాహన లేకుండా మాట్లాడారని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. గిరిజన వర్సిటీ ఏర్పాటుకు 2016-17లోనే 335 ఎకరాల స్థల సేకరణ చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని, తరగతుల నిర్వహణకు ములుగు సమీపంలోని జాకారంలో ఐటీసీకి చెందిన 21 వేల చదరపు అడుగుల భవనాన్ని సమకూర్చామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ గిరిజన గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.600 కోట్లు కేటాయించామని, మహబూబాబాద్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ బాలికల గురుకులాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. కాగా, దివంగత ఎమ్మెల్సీలు వెలిచాల జగపతిరావు, జస్టిస్ ఏ సీతారాంరెడ్డి మృతి పట్ల శాసనమండలి సంతాపం వ్యక్తం చేసింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సంతాప తీర్మానాన్ని చదవగా సభ్యులంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
పింఛన్లో కేంద్రం వాటా రెండు వందలే: ఎర్రబెల్లి
ఆసరా పింఛన్లల్లో కేంద్రం వాటా రూ.200 మాత్రమేనని పంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పునరుద్ఘాటించారు. కేంద్రం 6.66 లక్షల పింఛన్లకు మాత్రమే రూ.200 చొప్పున సహకారాన్ని అందజేస్తే.. తెలంగాణ ప్రభుత్వం 44.12 లక్షల పింఛన్లను అందజేస్తున్నదని తెలిపారు. ఎమ్మెల్సీలు సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ, మీర్జా రియాజుల్ హసన్ ఎఫెండీల ప్రశ్నలకు బదులిచ్చిన మంత్రి.. వృద్ధాప్య పింఛన్ల వయో పరిమితిని 57 ఏండ్లకు తగ్గించడంతో 8,11,817 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. పింఛన్ల కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.
వ్యవసాయ వర్సిటీకి అఫిలియేషన్ అధికారం
చట్ట సవరణకు అసెంబ్లీలో బిల్లు
ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీకి అగ్రికల్చర్ కాలేజీలకు అఫిలియేషన్ (అనుబంధ గుర్తింపు) ఇచ్చే అధికారం ఇవ్వనున్నది. ఇందుకు యూనివర్సిటీ చట్టంలో సవరణ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన బిల్లును బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి శానససభ ముందుంచారు. ఈ బిల్లు ఆమోదం పొందితే యూనివర్సిటీకి అఫిలియేషన్ (అనుబంధ గుర్తింపు) అధికారం దక్కుతుంది. ఇటీవల ప్రభుత్వం వనపర్తి, కరీంనగర్ జిల్లాల్లో ఏర్పాటు చేసిన కొత్త గురుకుల కాలేజీల్లో బీఎస్సీ(అగ్రికల్చర్), బీఎస్సీ(హార్టికల్చర్) కోర్సులను ప్రవేశపెట్టింది. అయితే, వర్సిటీకి అఫిలియేషన్ అధికారం లేకపోవడంతో ఈ కాలేజీలకు అనుమతి ఇబ్బందిగా మారింది.