Minister Niranjan Reddy | హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): రుణాలు ఇవ్వడం కూడా రైతులకు సాయం చేసినట్టేనా? అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో స్రిఫ్టు రాసిస్తే.. హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పా టు చేయడం తప్ప కిషన్రెడ్డి కేంద్ర మంత్రి హోదాలో తెలంగాణకు, రైతులకు ఏమి చేశారని ప్రశ్నించారు. వ్యవసాయ రంగానికి రూ.20 లక్షల కోట్ల రుణం ఇవ్వడం గొప్పతనమా? కేంద్రమంత్రి రుణాలను గొప్పగా చెప్పుకోవడం సమంజసమా? అని నిలదీశారు. ఎరువుల సబ్సిడీ అనాదిగా వస్తున్నదేనని శనివారం ఒక ప్రకటనలో గుర్తుచేశారు. ఆ సబ్సిడీని కూడా బీజేపీ ప్రభుత్వం తగ్గించిందని చురకలంటించారు. రూ.6,300 కోట్లతో ప్రారంభించిన రామగుండం యూరియా ఫ్యాక్టరీ నుంచి అర బస్తా యూరియానైనా రైతుల కోసం ఉత్పత్తి చేశారా? అని నిలదీశారు.
దేశంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన లబ్ధిదారుల సంఖ్య తొలుత 11 కోట్ల మంది ఉండగా ఇప్పుడు 3 కోట్లకు పడిపోయింది వాస్తవం కాదా? అని నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో తొలుత ఉన్న 38 లక్షల మంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన రైతుల సంఖ్యను 29 లక్షలకు తగ్గించారని మండిపడ్డారు. ఈ పథకం ద్వారా కేంద్రం రైతులకు ఇచ్చింది రూ.9,500 కోట్లు మాత్రమేనని, తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు ద్వారా రూ.65 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిందని వివరించారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి కిషన్రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయహోదా ఇవ్వాలని ఒకరోజైనా మీ ప్రభుత్వాన్ని కోరారా? అని ప్రశ్నించారు.