వనపర్తి : వందేళ్ల వయసు దాటినా కాంగ్రెస్(Congress) పార్టీకి రాజకీయ పరిణతి లేదు. రాజకీయ అవలక్షణాలు వదిలించుకోవడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) ఆ పార్టీ విధానాలపై ఫైర్ అయ్యారు. రైతుబంధు(Rythu bandhu) నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు లేఖ రాయడంపై మంత్రి స్పందించారు. శుక్రవారం వనపర్తిలోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటం ఆడతారా..రాజకీయాల కోసం రైతుబంధు వద్దని కాంగ్రెస్ ఎలా చెబుతుందని ప్రశ్నించారు. ప్రజల అంశాల మీద ఎన్నికలు గెలవాలి. అడ్డుపుల్లలు వేసి లబ్ధి పొందాలనుకోవడం రాజకీయం ఎలా అవుతుంది ? రైతుబంధు ఎన్నికల కోసం కాదు. వానాకాలం, యాసంగి పంట కాలాలకు రైతుబంధు అందజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి కామన్ సెన్స్ లేదని విమర్శించారు.
సీఎం కేసీఆర్ ఎంతో ఉన్నతమైన ఆలోచనతో రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చారు. రైతుబంధు పథకాన్ని అంతర్జాతీయ సంస్థ యూఎన్ఓలోని ఎఫ్ఎఓ విభాగం ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న అత్యుత్తమ పథకాల్లో రైతుబంధు, రైతుబీమా గొప్పవని ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. రైతుబంధు వద్దని ఈసీకి కాంగ్రెస్ రాసిన లేఖ వారి అక్కసును బయటపెట్టిందని మండిపడ్డారు.
కరోనా విపత్తులోనూ తెలంగాణలో ప్రత్యేక మార్గదర్శకాలతో వ్యవసాయ రంగానికి మినహాయింపు ఇచ్చాం. ఎవరు ఎన్ని ఆటంకాలు కల్పించినా మిగిలిపోయిన రుణమాఫీ పూర్తి చేస్తాం. యాసంగి రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో వేస్తాం. రైతులు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.