Minister Niranjan Reddy | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR )ను ఎదుర్కోలేకనే ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )పై కక్షపూరిత కేసులు నమోదు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి( Minister Niranjan Reddy ) ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల( ED Notice ) నేపథ్యంలో బీజేపీ తీరుపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈడీ నోటీసు విద్వేషపూరిత రాజకీయాలకు పరాకాష్ట అని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలను బీజేపీ భ్రష్టు పట్టించి, వాటి విశ్వసనీయతను దెబ్బతీసిందని మండిపడ్డారు. ఈడీ, సీబీఐ, ఐటీ నోటీసులు, కేసులు అంటే ప్రజలు నవ్వుకునే పరిస్థితి వచ్చిందన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన అదానీ గురించి కేంద్రం ఎందుకు నోరు మెదపదు? అని మంత్రి నిలదీశారు. ఈడీ, సీబీఐ, ఐటీలు ఎందుకు దర్యాప్తు చేయవు..? మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలలో ఎమ్మెల్యేలను కొని అక్రమంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన బీజేపీ తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది నిజం కాదా..? కేంద్రాన్ని నిలదీస్తున్న వారిపై కేసులు పెడుతున్నారు.. దారికి వచ్చిన వారిపై దయ చూపిస్తున్నారు. ఇటీవల మేఘాలయ ఎన్నికలలో మోదీ, అమిత్ షా అక్కడి ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా మీద తీవ్ర అవినీతి ఆరోపణలు చేయలేదా? ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే బీజేపీ అదే సంగ్మాకు మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో చేరింది నిజం కాదా? అదే సంగ్మా ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మలు హాజరు కావడం బీజేపీ ద్వంద నీతికి అద్దం పడ్తలేదా? అని నిరంజన్ రెడ్డి నిలదీశారు.
దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ దేశ రాజకీయాలను, వ్యవస్థను నాశనం చేస్తున్నారు అని మంత్రి కోపోద్రిక్తులయ్యారు. భారత ప్రజాస్వామిక వ్యవస్థను దిగజార్చడం గర్హనీయం. రాష్ట్ర సాధన కోసం పార్టీ ఏర్పాటు చేసి 14 ఏండ్లు పోరాడి తెలంగాణ సాధించిన చరిత్ర కేసీఆర్, బీఆర్ఎస్ది అని స్పష్టం చేశారు. కేసులతో వేధించి ఏదో సాధిస్తామనుకోవడం అత్యాశ అని పేర్కొన్నారు. కేసీఆర్ అబ్ కీ బార్ .. కిసాన్ సర్కార్ నినాదం దేశ రాజకీయాల్లోకి కొత్త ఆలోచనలను రగిలిస్తున్నది. పోరాటం తెలంగాణ రక్తంలోనే ఉంది.. అది ఈ నేల మాకు వారసత్వంగా ఇచ్చిందని మంత్రి తెలిపారు.
కేసులతో బీఆర్ఎస్ ఎదుగుదలను అడ్డుకోలేరు అని మంత్రి నిరంజన్ రెడ్డి తేల్చిచెప్పారు. తెలంగాణలో బీజేపీకి అధికారం పగటికల అని అన్నారు. రాబోయే ఎన్నికలలో బీజేపీ నియంతృత్వ విధానాలకు దేశ ప్రజలే జవాబిస్తారు అని మంత్రి పేర్కొన్నారు.