హైదరాబాద్ : సాగు వైపు కొత్త తరాన్ని మళ్లించేందుకు రైతుబంధులాంటి కార్యక్రమాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని, అలాంటి ప్రయత్నాలకు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతుబంధు స్ఫూర్తిగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. రైతుల ఖాతాల్లోకి రైతుబంధు పంట సాయం రూ.50వేలకోట్లు జమకానున్న తరుణంలో రేపటి నుంచి వారం రోజుల పాటు రైతుబంధు సంబురాల నిర్వహణకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, సంబురాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. కార్ఫరెన్స్లో మంత్రి నిరంజన్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంబురాలకు సంబంధించి కావాల్సిన ఎలాంటి సమాచారాన్ని అయినా వ్యవసాయశాఖ తరఫున ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల తరఫున అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. శాఖ తరఫున ప్రచార, సమాచార సామగ్రిని సిద్ధం చేస్తున్నామన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా గొప్ప కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేపట్టి విజయవంతంగా కొనసాగిస్తున్నారన్నారు. 63లక్షల తెలంగాణ రైతులకు రైతుబంధు అందిస్తున్న అపురూప కార్యక్రమం భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో లేదనడం అతిశయోక్తి కాదన్నారు. ఏక కాలంలో అత్యధిక మందికి ఉపాధి ఇవ్వగలిగే వ్యవసాయ రంగాన్ని ఎంత పటిష్టం చేస్తే అంత మంచిదనే దూరదృష్టి, దార్శనికతతో కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. కార్యక్రమం అద్భుతమైన విజయాన్ని సాధించిన నేపథ్యంలో అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.