హైదరాబాద్, సెప్టెంబర్ 3(నమస్తే తెలంగాణ): వర్షాభావ పరిస్థితుల్లోనూ ఈ వానకాలంలో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని, దీనికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 24 గంటల విద్యుత్తు సరఫరాయే కారణమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. వానకాలం పంటల సాగుపై మంత్రి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.18 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల వ్యవసాయ పంటలు సాగు చేశారని పేర్కొన్నారు. 57.51 లక్షల ఎకరాల్లో వరి, 44.73 లక్షల్లో పత్తి, 5.28 లక్షల్లో మొకజొన్న, 4.61 లక్షల ఎకరాల్లో కంది పంటలను సాగు చేశారని తెలిపారు.
భూగర్భ జలవనరులు పెరగడం, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరాతో రైతుల్లో సాగుకు భరోసా ఏర్పడిందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1న 14,747 మెగావాట్ల అత్యధిక విద్యుత్తు డిమాండ్ నమోదైందని, నిరుడు ఇదే రోజు 11,198 మెగావాట్లు మాత్రమే డిమాండ్ ఉందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం కరంటు వినియోగంలో వ్యవసాయరంగం 35 నుంచి 40 శాతం వాటా నమోదవుతున్నదని, రైతాంగానికి అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేస్తూ వ్యవసాయ రంగాన్ని సీఎం కేసీఆర్కు ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు.