నాగర్కర్నూల్ (నమస్తే తెలంగాణ)/కొల్లాపూర్/వనపర్తి/కోడేరు/బిజినేపల్లి/భూత్పూర్, మే 6: ఆంధ్రా-తెలంగాణ రాష్ర్టాల మధ్య నీటి వాటా తేల్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను సీఎంవో కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్రెడ్డి, గువ్వల బాలరాజు, తెలంగాణ ప్రాజెక్టుల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ మురళీధర్రావుతో కలిసి మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయా చోట్ల నిరంజన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ర్టాల మధ్య వాటా ప్రకటించకపోవడంతో ఆంధ్రా ఎక్కువ మొత్తంలో నీటిని తరలిస్తున్నదని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 2015 జూన్ 11న సుమారు రూ.35 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. దాదాపు లక్షన్నర ఎకరాలకు సాగునీరును అందించాలన్న లక్ష్యంతో పనులు మొదలుపెట్టినట్టు ఆయన పేర్కొన్నారు.
అయితే పలుమార్లు ఇంటి దొంగలే కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు యత్నించారని, అందుకే పనుల్లో జాప్యం జరిగినట్టు తెలిపారు. ఒక్కో సమస్యను అధిగమిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు నుంచి ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, పరిగి, చేవెళ్ల, తాండూరు, వికారాబాద్ ప్రాంతాలకు సాగు, తాగునీరు అందిస్తామని తెలిపారు. బీడు భూముల్లో కృష్ణా జలాలను పారించి జిల్లాను సస్యశ్యామలం చేసి తీరుతామని స్పష్టం చేశారు. 9 ఏండ్లుగా నీటి విషయంలో మోదీ సర్కార్ నాన్చుడు ధోరణి అవలంబిస్తుంటే.. మరోవైపు ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఆంధ్రా నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో ఎప్పుడు నీటి కేటాయింపులు జరిగినా ప్రాజెక్టు నీటి వాటాకు లోబడి ఉంటుందని మంత్రి వివరించారు. సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని, పనుల్లో ఎలాంటి జాప్యం చేయకూడదని అధికారులు, ఇంజినీర్లను ఆదేశించారు.