వనపర్తి, ఖిల్లాఘణపురం : రాష్ట్రంలో బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయం ఖాయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Minister Niranjan Reddy) ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, తలకిందులుగా తపస్సు చేసినా ఒరిగేదేమీ లేదన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండల కేంద్రంలోని బాదం సరోజిని దేవి కల్యాణ మండపంలో గ్రామ పంచాయతీల బీఆర్ఎస్ ( BRS ) ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఎస్ఎన్ఆర్ యువసేనతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గడపకూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరాయని అన్నారు.
ప్రతిపక్షాలు తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక చాడీలు, ఇతరత్రా కుట్రలను పన్నుతున్నారని ధ్వజమెత్తారు. వీరికి ఓటుతోనే సరైన సమాధానం చెప్పాల్సిన ఆసన్నమైందన్నారు. ఖిల్లా మండల రూపురేఖలను మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని, ఈసారి గులాబీ పార్టీకి మెజార్టీ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందన్నారు. సాగునీటి రాకతో పల్లెలన్నీ పచ్చబడ్డాయని తెలిపారు.
గతంలో వలసలు వెళ్లిన వారు తిరిగొచ్చి వ్యవసాయం, ఇతర పనులు చేసుకుంటూ సంతోషకర జీవనం గడుపుతున్నారని చెప్పారు. ప్రతిఒక్కరూ వారి కాళ్ల మీద వాళ్లు నిలబడి ఆర్థిక స్వావలంబన సాధించాలన్నదే సీఎం కేసీఆర్( CM KCR ) తపన అన్నారు. మంచి పనులు చేస్తున్న సీఎం కేసీఆర్ సర్కారును ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. గణప సముద్రాన్ని రిజర్వాయర్గా మార్చేందుకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తామని, రైతులు, గ్రామస్తులు అధైర్యపడొద్దని మంత్రి అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.