మహబూబ్నగర్/వికారాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘పాలమూరు’ జలాలు దేవుడి పాదాలను తాకాయి. సీఎం కేసీఆర్ సంకల్పంతో తమ ఏండ్ల కలసాకారం కావడంతో ఉబికివచ్చిన కృష్ణా జలాలను తీసుకెళ్లిన ప్రజలు తమ గ్రామాల్లో దేవుళ్లకు అభిషేకించి, పులకించిపోయారు. శనివారం సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐఎస్)ను నార్లాపూర్ వద్ద ప్రారంభించిన విషయం తెలిసిందే. నార్లాపూర్ వద్ద సిస్టర్న్ నుంచి వెలువడిన కృష్ణాజలాలను బీఆర్ఎస్ నేతలు, రైతులు, అభిమానులు కలశాల్లో ఒడిసిపట్టుకొని గ్రామాలకు చేరుకొన్నారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మోనేశ్వరస్వామి ఆలయంలో మహాశివుడికి మంత్రి శ్రీనివాస్గౌడ్ కృష్ణా జలాలతో అభిషేకం నిర్వహించారు జడ్చర్ల ఇండస్ట్రియల్ ఏరియాలోని శివాలయంలో శివలింగానికి ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి, భూత్పూర్ మండలం అన్నాసాగర్లోని ఆంజనేయస్వామి ఆలయంలో ఉన్న శివలింగానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, అచ్చంపేట పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, కొల్లాపూర్ సింగోటం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి జ లాభిషేకం చేశారు. వనపర్తిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు కలశాలతో మంత్రి నిరంజన్రెడ్డి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆలయంలో స్వామివారికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి పరిధిలో కాలువలు నిర్మించి ఉమ్మడి జిల్లాలోని బీడు భూములను బంగారు పంటలు పండేలా చేస్తామని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టును సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేయడంతో ఈ ప్రాంతవాసులు చిరకాల వాంఛ నెరవేరిందని చెప్పారు.
వికారాబాద్లో..
పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి కృష్ణా జలాలు తీసుకొచ్చిన జనం ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వాటితో దేవుళ్లకు అభిషేకం చేశారు. వికారాబాద్లోని బుగ్గరామలింగేశ్వరాలయంలో సమాచార పౌర సంబంధాలు, గనులు, భూగర్భ శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి జలాభిషేకం చేసి, ప్రత్యేక పూజలు చేశారు. పాలమూరు జలాలతో కరువు ప్రాంతం సాగునీటి గోస శాశ్వతంగా తీరుతుందని తెలిపారు.