హైదరాబాద్/న్యూఢిల్లీ, మే 8 (నమస్తే తెలంగాణ)/శంషాబాద్ రూరల్: మూడురోజుల ఉత్కంఠకు తెరపడింది. మణిపూర్ నుంచి ప్రత్యేక విమానంలో 72 మంది తెలంగాణ విద్యార్థులు, పౌరులు సోమవారం సురక్షితంగా రాష్ర్టానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, అడిషనల్ డీజీలు మహేశ్ భగవత్, అభిలాషబిస్త్, డీఐజీ సుమతి, రంగారెడ్డి కలెక్టర్ హరీశ్, ప్రొటోకాల్ డైరెక్టర్ అర్విందర్సింగ్ విద్యార్థులకు ఘనస్వాగతం పలికారు. మణిపూర్లోని వివిధ ప్రాంతాల్లో చదువుతున్న, ఉద్యోగాలు చేస్తున్న, చిరువ్యాపారాలు చేస్తున్న తెలంగాణ బిడ్డలను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ మణిపూర్’ విజయవంతంగా ముగిసింది. వారం రోజులుగా హింస, అల్లర్లతో అట్టుడుగిపోతున్న మణిపూర్ నుంచి తెలంగాణ పౌరులను క్షేమంగా రాష్ర్టానికి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేయించడంతోపాటు..
ప్రత్యేక విమానాన్ని పంపి మనవారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్.. మణిపూర్ సీఎస్, డీజీపీలతో సమన్వయం చేసుకుంటూ మన పౌరులకు అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకున్నారు. ఆదివారం ఉదయమే ప్రత్యేక విమానం హైదరాబాద్ రావాల్సి ఉండగా.. ఇంఫాల్ ఎయిర్పోర్టులో నెలకొన్న ఎయిర్ ట్రాఫిక్ కారణంగా సాంకేతిక సమస్యలతో పౌరుల తరలింపు సోమవారానికి వాయిదా పడింది. ఇటు రాష్ట్ర ఉన్నతాధికారులు అటు ఢిల్లీ తెలంగాణ భవన్ నుంచి అధికారులు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిరంతరం సమన్వయం చేసుకుంటూ మణిపూర్ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ విద్యార్థులు, పౌరులకు వసతి, భోజన ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక హెల్ప్లైన్ను సంప్రదించిన వారికి మన పోలీసు ఉన్నతాధికారులు అవసరమైన వసతిని స్థానిక పోలీసులతో కల్పించారు. ప్రస్తుతం రాష్ర్టానికి సురక్షితంగా చేరుకున్న వారిలో ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జేఐఎంఎస్, మణిపూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు నిర్మల్ జిల్లా భైంసా పట్టానికి చెందిన కుటుంబం, ఇంఫాల్లో చిరువ్యాపారాలు చేసుకుంటున్న పౌరులు ఉన్నారు.
కోల్కతా మీదుగా మరో 34 మంది
తెలంగాణ విద్యార్థులు, పౌరులు సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం మణిపూర్లో మిగిలిన మరో 34 మందిని కూడా క్షేమంగా స్వస్థలాలకు చేర్చేందుకు కంకణం కట్టుకుంది. మొత్తం 130 విద్యార్థుల్లో ప్రస్తుతం కొందరు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోగా.. అధికారులు మరికొంతమందిని సోమవారం అర్ధరాత్రి, మంగళవారం ఉదయం వరకు తెలంగాణకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. ఇంఫాల్ నుంచి మరో విమానం సోమవారం అర్ధరాత్రి చేరుకోనున్నట్టు తెలిసింది. అలాగే వయా రాయపూర్, పాట్నా, భువనేశ్వర్ల ద్వారా వచ్చే విమానాల్లో కొంతమంది విద్యార్థులను హైదరాబాద్కు చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక స్వరాష్ర్టానికి చేరుకున్న విద్యార్థులు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు సైతం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది. మణిఫూర్లో అల్లర్ల నేపథ్యంలో తెలంగాణకు రావాలనుకున్న ప్రతి విద్యార్థి, పౌరుడి ఖర్చును ప్రభుత్వమే భరించింది. ఈ మేరకు ప్రత్యేక విమానాలు, రైలు, బస్సు మార్గాల్లో వస్తున్న వారి ఖర్చును సైతం ప్రభుత్వమే భరిస్తున్నది.
ఎయిర్పోర్టులో మంత్రి మల్లారెడ్డి స్వాగతం
మణిపూర్ నుంచి సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో వచ్చిన తెలంగాణకు చెందిన 72 మంది విద్యార్థులకు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, అడిషనల్ డీజీలు మహేశ్భగవత్, అభిలాషబిస్త్, డీఐజీ బీ సుమతి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, ప్రొటోకాల్ డైరెక్టర్ ఆర్విందర్సింగ్ తదితర అధికారులు ఎయిర్పోర్టులో ఘనస్వాగతం పలికారు. మణిపూర్ నుంచి సురక్షితంగా రప్పించిన సీఎం కేసీఆర్ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం 1.22 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో విద్యార్థులను తీసుకువచ్చింది. తెలంగాణకు చెందిన విద్యార్థులు తొలి విమానంలో 72 మంది వచ్చారు. మరో 130 మంది మరో విమానంలో రాత్రి, మంగళవారం వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాయపూర్, పాట్నా, భువనేశ్వర్ ఎయిర్పోర్టుల ద్వారా తెలంగాణకు చేరుకుంటారని వివరించారు.
ఒక్క ఫోన్తో అన్నీ కల్పించారు..
ఇక్కడ ఎటుచూసినా కర్ఫ్యూ ఉంది. సిగ్నల్స్ లేవు. తెలిసిన వారి దగ్గర్నుంచి ప్రభుత్వం ఇచ్చిన హెల్ప్లైన్కు కాల్ చేసి, అడ్రస్ చెప్పగానే మాకు ప్రొటెక్షన్ కల్పించారు. ప్రభుత్వం ఇంత త్వరగా రెస్పాండ్ అవుతదని ఎవ్వరం అనుకోలె. మా బాధలు విని తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ గారికి మా విద్యార్థులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. కాలేజ్ నుంచి ఎయిర్పోర్టు వరకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. సుమతి మేడం ఒక అక్కలాగా మాతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
– సాయికిరణ్, బాధిత విద్యార్థి ఘట్కేసర్
పసిబిడ్డతో క్షేమంగా ఇంటికొచ్చాం
మేము మొత్తం ఫ్యామిలీ ఐదుగురం ఉన్నాం. ఇక్కడి దాడులకు మాకు చాలా భయమేసింది. ఇక్కడ ఆందోళనకారులు చేసే శబ్దాలకు పసిపాప బాగా ఏడ్చేది. మాకు కూడా చాలా భయమేసింది. ఎలాగైనా ఇంటికి రావాలనుకున్నాం. హెల్ప్లైన్ను సంప్రదించడంలో మాకు రక్షణ కల్పించారు. మాకోసం ప్రత్యేకంగా వాహనాలొచ్చాయి. సురక్షితంగా మేము ఐదుగురం ఇంటికి చేరుకున్నాం. మాకు కావాల్సిన ఏర్పాట్లు చేసి, క్షేమంగా ఇంటికి చేర్చిన తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం.
– ఆకాశ్ దంపతులు