ఘట్కేసర్ రూరల్, జూన్ 23 : ప్రజలలో నెలకొన్న మూఢ నమ్మకాలను తొలగించి అజ్ఞానులను విజ్ఞానులుగా మార్చిన మహనీయుడు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ రూరల్ మండలం అవుషాపూర్లో విశ్వ బ్రాహ్మణులు నూతనంగా నిర్మించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో.. గురువారం జరిగిన స్వామి వారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు.
ప్రతి ఒక్కరిలో దైవభక్తితో పాటు సామాజిక సేవా లక్షణాలు కలిగి ఉండాలన్నారు. సామాన్య మానవుడిగా జన్మించిన ఆయన భవిష్యత్లో జరిగే పరిణామాలను కాలజ్ఞానం ద్వారా బోధించిన విషయాలు నేటికి నిజమవుతున్నాయన్నారు. స్వామి వారి విగ్రహాన్ని బహుకరించిన దాత ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డిని ఆయన అభినందించారు.
కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఏనుగు కావేరి, ఉప సర్పంచ్ అయిలయ్య యాదవ్, సహకార సంఘం డైరెక్టర్ పోచిరెడ్డి, మండల టీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, నాగరాజు, వెంకట్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మల్లేష్, వెంకటేశ్ గౌడ్, విశ్వ బ్రాహ్మణులు ఆచారి, ఓంకార్ చారి, అంజయ్య, నరసింహ, విష్ణుమా చారి తదితరులు పాల్గొన్నారు.