మేడ్చల్ మల్కాజిగిరి : తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర మండలం గోధుమకుంటలో బుధవారం మంత్రి మల్లారెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భవన నిర్మాణ కార్మికుల శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతులకు ఉచితంగా ట్రైనింగ్ ఇప్పించి 30 మందికి కుట్టుమిషన్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో గ్రామాల అభివృద్ధి గురించి ఏ నాయకుడు పట్టించుకున్న దాఖాలాలు లేవు. ప్రజలకు అవసరమైన ప్రతి పనిని ప్రభుత్వమే దగ్గరుండి చేయించి ప్రజలకు అండగా ఉంటుందన్నారు. కోట్లాది రూపాయలతో గ్రామాల్లో అనేక రకాల పనులు తీసుకొని ముందుకెళ్తున్నామన్నారు. ప్రభుత్వ హయాంలో అమలవుతున్న ప్రతి పథకం కూడా అర్హులైన వారందరికి అందిస్తున్నామని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లను కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని మళ్లీ ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక సర్పంచ్ ఎంపీటీసీల మీదనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ, సర్పంచ్ ఆకిటి మహేందర్ ఉప సర్పంచ్ సోమని ఆంజనేయులు, ఎంపీటీసీ మంచాల కిరణ్, పంచాయతీ కార్యదర్శి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.