మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 22 : తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 9, 12, 15, 17, 3వ వార్డులలో రూ.75 లక్షల 30 వేలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంతల రోడ్లు లేకుండా గ్రామాల్లో, పట్టణాలలో సీసీ, బీటీ రోడ్లను నిర్మిస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిని నిర్వహించి పల్లెలు, పట్టణాలను శుభ్రంగా తీర్చిదిద్దుకున్నామని చెప్పారు.
ప్రజలు ఇబ్బందులు పడకుండా మార్కెట్లను, వైకుంఠధామాలను, పార్కులను అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారని, హరితహారంతో గ్రామాలు, పట్టణాలు పచ్చటి తోరణాలుగా దర్శనం ఇస్తున్నాయని తెలిపారు.
పలు వార్డులలో మంత్రి మొక్కలను నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, కమిషనర్ ఎ.వాణిరెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వెంకటేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.