మేడ్చల్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల పట్టణాలకు దీటుగా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో గురువారం జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు(Panchayat Secretaries ), సర్పంచ్లతో టీఎస్-బీపాస్పై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు.
ప్రభుత్వం భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేందుకు ప్రవేశపెట్టిన టీఎస్-బీపాస్(TS bpass) వల్ల గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభతరంగా అనుమతులు లభిస్తున్నాయని వెల్లడించారు. గతంలో గ్రామాల్లో ఇంటి నిర్మాణాలు చేపట్టాలంటే జిల్లా, మండల కేంద్రాలకు వచ్చి సంబంధిత ఇంజనీర్లతో ప్లాన్ తీసుకుని వాటిని తీసుకెళ్లి గ్రామపంచాయతీలలో నమోదు చేసుకునేందుకు చాలా సమయం పట్టెదని అన్నారు. ప్రజలు ఇబ్బందులు తీర్చేందుకు గ్రామీణ ప్రాంతాలలో టీఎస్-బీపాస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించి అప్పటి కప్పుడే రుసుమును ఇంటి యజమాని నేరుగా చెల్లించేందుకు అవకాశం కల్పించిందన్నారు.
జిల్లా వ్యాప్తంగా 61 గ్రామపంచాయతీలు ఉండగా జీవో నెంబర్ 131, 135 వల్ల పంచాయితీలకు ఇంటి అనుమతుల ద్వారా ఆదాయం సమకూరి గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. టీఎస్-బీపాస్ గురించి గ్రామాలలో అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు మంత్రి పిలుపునిచ్చారు. ఇళ్లు లేని నిరుపేదలందరికి 60 గజాల స్థలం నుంచి 120 గజాల స్థలాలలో ఇళ్లు కట్టుకునే వారికి ప్రభుత్వం గృహలక్ష్మీ(Gruhalaxmi) పథకం ద్వారా రూ. 3 లక్షలు మంజూరు చేస్తుందని వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో 3 వేల మందికి గృహలక్ష్మీ పథకం అందించేలా అనుమతి వచ్చిందని పేర్కొన్నారు.
దళితబంధు(Dalit Bandi) పథకం ద్వారా త్వరలోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తారని, జిల్లా వ్యాప్తంగా 5,500మంది లబ్ధిదారులకు పథకాన్ని వర్తింపజేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ ఆగ్యస్త, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వెంకటేశ్, జిల్లా పంచాయతీ అధికారి రమణామూర్తి , సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.