హైదరాబాద్/మేడ్చల్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): మంత్రి మల్లారెడ్డి సంస్థల్లో సోదాల సందర్భంగా ఐటీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించటం వివాదస్పదంగా మారింది. సోదాల సందర్భంగా తన పెద్ద కుమారుడు మహేందర్రెడ్డిని భయభ్రాంతులకు గురిచేయటంతోపాటు దాడిచేశారని.. భయం కారణంగా ఛాతీనొప్పితో ఇబ్బందిపడుతూ ఐసీయూలో చేరాడని మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి తాను టర్కీ పర్యటనలో ఉన్నానని, గురువారం వస్తున్నానని.. సోదాలకు సహకరిస్తానని అధికారులకు ఫోన్లో చెప్పినా వినలేదు. ఆయన ఇంటి తాళాలు పగులగొట్టి తనిఖీలు చేపట్టారు. 75 ఏండ్లు దాటిన ఆయన తల్లిదండ్రులను రాత్రీపగలనే తేడా లేకుండా, విశ్రాంతి తీసుకోనివ్వకుండా రెండు రోజులపాటు కాలేజీకి, ఇంటికి తిప్పారు. నిబంధనలకు విరుద్ధంగా బుధవారం రాత్రి మహిళా పోలీసులు లేకుండా మర్రి రాజశేఖర్రెడ్డి కూతురిని అదుపులోకి తీసుకొన్నారు. జీపులో పురుష పోలీసుల మధ్య ఆమెను కూర్చోబెట్టి బ్యాంకు లాకర్లు తెరిచేందుకు తీసుకెళ్లటంపై విమర్శలు వెల్లువెత్తాయి. తల్లిదండ్రులు లేని సమయంలో ఒంటరిగా యువతిని తీసుకెళ్తారా? ఇదేనా మహిళలకు మోదీ ప్రభుత్వం ఇచ్చే గౌరవం అంటూ సోషల్మీడియాలో నెటిజన్లు ప్రశ్నించారు. రాజకీయంగా కక్షసాధించటంలో వారి పిల్లలను సైతం వేధిస్తారా? అని నిలదీస్తున్నారు.
సోదాల సందర్భంగా ఐటీ, ఈడీ బృందాలు వికృతచేష్టలకు పాల్పడుతున్నాయని మేధావులు విమర్శిస్తున్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నా భౌతిక దాడులకు పాల్పడుతూ, మానసికంగా హింసిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈడీ అధికారులు ఇటీవల రాష్ట్రంలోని గ్రానైట్ ఎక్స్పోర్ట్ సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. మంత్రి గంగుల కమలాకర్ దుబాయ్ పర్యటనలో ఉండగా ఈడీ అధికారులు ఈ నెల 9న కరీంనగర్లోని ఇంటికి తనిఖీకి వచ్చారు. సోదాలకు సహకరిస్తానని గంగుల వీడియోకాల్లో అధికారులకు చెప్పినప్పటికీ వినకుండా ఇంటి తాళాలు పగులగొట్టి తనిఖీలు చేపట్టారు. కేవలం 16 గంటల్లోనే గంగుల తిరిగి వచ్చి అధికారులకు సహకరించారు. ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయనే విచారణ పేరుతో సీబీఐ, ఈడీ బృందాలు సెప్టెంబర్ 16న తనపై భౌతికదాడులకు దిగాయని అరబిందో రియాల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ చందన్ ఎర్లా పేర్కొన్నారు. తాము చెప్పినట్టుగా సంతకాలు పెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికారులు బెదిరించారని, వారి దాడితో రెండు చెవులు వినిపించటంలేదని ఎంఎల్సీ (మెడికో లీగల్ కేసు) రిపోర్ట్ను జతచేసి నవంబర్ 11న ఈడీ డైరెక్టర్కు ఫిర్యాదు చేశారు.
ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టేందుకు ఐటీ, ఈడీ, సీబీఐలను బీజేపీ ప్రభుత్వం జేబు సంస్థలుగా వాడుకొంటున్నది. నయానో.. భయానో తమ పార్టీలోకి రాకపోతే వారి ఆస్తులపై, సంస్థలపై దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నది. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నించి విఫలమైన చోట ఐటీ, ఈడీ, సీబీఐని ప్రయోగించి మప్పుతిప్పలు పెడుతున్నది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు రాయబారాలు నడిపిన బీజేపీ దూతలను తెలంగాణ ప్రభుత్వం రెడ్హ్యాండెడ్గా బుక్చేసి ప్రజాబోనులో నిలబెట్టింది. కమల్ఫైల్స్ కుట్రకు పాల్పడిన మోదీ,షా నిజస్వరూపాన్ని నడిబజారుకు ఈడ్చింది. మరోవైపు మునుగోడు ఉపఎన్నికలో పరాభవం.. ఈ నేపథ్యంలోనే బేగంపేట విమానాశ్రయం సాక్షిగా ‘అబ్ ముకాబ్లా రంగీన్ హోగా’ అని మోదీ వేలు చూపిస్తూ, పోడియంపై గుద్దుతూ మరీ హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సందర్భం వచ్చినప్పుడల్లా ‘ఇక ఆటమొదలైంది.. ఎవరినీ వదిలిపెట్టం. ఈడీ, ఐటీ, సీబీఐ వస్తున్నాయి కాచుకోండి’అని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ పర్యవసానాల పరంపరలో భాగంగానే ఈడీ, ఐటీ రాష్ట్రంపై మోహరించాయి. సోదాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయటం, అధికార పార్టీ నాయకలను భయపెట్టడమే బీజేపీ లక్ష్యమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వ్యాపారాలు చేసుకొనే ప్రజాప్రతినిధులు భయంతో తమ పార్టీలో చేరేలా ఒత్తిడి తెచ్చేందుకు దర్యాప్తు సంస్థలను ముందుపెట్టి బీజేపీ భారీ వ్యూహాన్ని అమలు చేస్తున్నదని ఉదహరిస్తున్నారు. తమ కుటుంబమంతా బీజేపీలో చేరాలన్నదే ప్రస్తుత సోదాల లక్ష్యమని మంత్రి మల్లారెడ్డి అల్లుడు, టీఆర్ఎస్ మల్కాజిగిరి పారమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి పేర్కొనటం.. బీజేపీ కుట్రలను స్పష్టంచేస్తున్నది.
మంత్రి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి నివాసాల్లో ఐటీ దాడులు చేసినట్టుగా, బీజేపీ నాయకుల ఇండ్ల కు ఈ సంస్థలు ఎందుకు వెళ్లవు? కక్షపూరితంగా వీరిపై దాడులు చేయిస్తున్నారు. రాజకీయంగా తొక్కేసేందుకు బీజేపీ ఆడుతున్న డ్రామా అని అర్థమవుతున్నది. మహిళ అనే గౌరవం లేకుండా రాజశేఖర్రెడ్డి కుమార్తెను రాత్రివేళ విచారణకు తీసుకెళ్లటం సరికాదు.
-శైలజ, కార్ఖానా
మర్రి రాజశేఖర్రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేయటాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు. ఒంటరిగా ఉన్న వారి కుమార్తెను దోషిలా జీపులో పురుష పోలీసుల మధ్య తీసుకెళ్లటం అమానుషం. 75 ఏండ్లు పైబడిన రాజశేఖర్రెడ్డి తల్లిదండ్రులను కాలేజీకి, ఇంటికి పదేపదే తిప్పడం సరికాదు.
-భారతి, మేడ్చల్
దర్యాప్తు సంస్థలు బీజేపీ ప్రభుత్వం చేతుల్లో బందీలుగా మారిపోయాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఐటీ సోదాలు చేయడం దారుణం. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే శక్తిలేక మంత్రి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డిపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పింది. మహిళా పోలీసులు లేకుండా రాజశేఖర్రెడ్డి కుమార్తెను రాత్రివేళ విచారణకు తీసుకెళ్లి బాధపెట్టడం ఉద్దేశపూరితంగా చేసినట్టుగా కనిపిస్తున్నది.
-యాదలక్ష్మి, బోయిన్పల్లి