చౌటుప్పల్: మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కోమటిరెడ్డి స్వార్థంతోనే ఉపఎన్నిక వచ్చిందని విమర్శించారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన ఆయన నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోలేదని విమర్శించారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో నిర్వహించిన ప్రచారంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటేయాలని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలను మోసం చేసిన రాజగోపాల్రెడ్డి ఒక 420 అని చెప్పారు. ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల తరఫున.. నాంపల్లి మండలంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మండలంలోని చల్లనికుంటలో ఓటర్లను కలిసిన మంత్రి.. కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను వివరించారు. మునుగోడు అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్కే పట్టంకట్టాలన్నారు.
నాంపల్లి మండలంలోని రేవెల్లి తుమ్మలపల్లిలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. కూసుకుంట్లను మరోసారి అసెంబ్లీకి పంపించాలని కోరారు. ఇక పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నారాయణపురం మండలంలోని గిరిజన తండాల్లో విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.