మేడ్చల్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులకు చేసే సేవలను అదృష్టంగా భావించాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లారెడ్డి వర్సిటీలో గురువారం 800 మంది దివ్యాంగులకు కృత్రిమ చేతుల అమరిక శిబిరాన్ని ఎల్ఎన్-4, రోటరీ ఇంటర్నేషల్ 3150 ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒక్కరికి లక్ష రూపాయల విలువైన కృత్రిమ చేతులను ఉచితంగా అమర్చడం అభినందనీయమన్నారు.
దివ్యాంగుల సేవల్లో తనను భాగస్వామిని చేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. అమెరికాకు చెందిన ఎల్ఎన్-4 స్వచ్ఛంద సంస్థ దివ్యాంగుల కోసం 2015 నుంచి ఇప్పటివరకు 200 శిబిరాలు నిర్వహించడం హర్షణీయమని కితాబిచ్చారు. ఇలాంటి కార్యక్రమాలకు తన సహకారం అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ కన్వీనర్ దయానంద్గౌరి, కో కన్వీనర్ వాల్మీకి హరికిషన్, రవి వడ్లమాని, మోహన్కుమార్, వర్సిటీ వీసీ వీఎస్కే రెడ్డి, చంద్రకాంత్, వైద్యులు శిరోలే, మల్లికార్జున్రెడ్డి పాల్గొన్నారు.