మేడ్చల్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): నిరుపేదలకు ఎలాంటి పైరవీ లేకుండా పారదర్శకంగా డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించినట్టు మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. సీఎంగా కేసీఆర్ ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. శనివారం మేడ్చల్ జిల్లా అహ్మద్నగర్లో డబుల్ ఇండ్లను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ముషీరాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాలకు చెందిన 1,500 మంది లబ్ధిదారులకు లాటరీ ద్వారా బ్లాక్లను ఎంపి క చేసి, అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదల సొం తింటి కల నెరవేర్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అర్హులైన వారందరికీ ఇండ్లు వస్తాయని, ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు. దశలవారీగా ఇండ్లను సర్కారు అందజేస్తుందని వెల్లడించారు. సొంత స్థలం ఉన్నవారు తమకు ఇష్టమొచ్చిన విధంగా ఇల్లు కట్టుకొనేందుకు గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలు ఇస్తున్నట్టు చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీని నమ్మితే మోసపోతారు!
బీజేపీ, కాంగ్రెస్ను నమ్మితే మోసపోతారని మంత్రి మల్లారెడ్డి ప్రజలను హెచ్చరించారు. వారు తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలన్నింటినీ బంద్ చేస్తారని చెప్పారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎక్కడా అమలు చేయకుండా.. తెలంగాణలో కొత్త కొత్త పథకాలు అమలుచేస్తామంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను చూసి సీఎం కేసీఆర్ను దేశానికి నాయకత్వం వహించాలని ఇతర రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గంథ్రాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్రెడ్డి, జవహర్నగర్ మేయర్ కావ్య, దమ్మాయిగూడ మున్సిపల్ చైర్పర్సన్ ప్రణీత, ముషీరాబాద్, సికింద్రాబాద్ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
యజ్ఞంలా పంపిణీ: ముఠా గోపాల్
నిరుపేదల సొంతింటి కలను సాకరం చేసేందుకు సీఎం కేసీఆర్ ఒ యజ్ఞంలా ముందుకు సాగుతున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రతి కార్యక్రమం ఎంతో గొప్పదని చెప్పారు. ఇక్కడ చేపడుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను దేశంలోని ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో ఎలాంటి రాజకీయాలు, పైరవీలకు తావులేకుండా పారదర్శకంగా చేపట్టడం ఎంతో గొప్ప విషయమని చెప్పారు.