మైలార్దేవ్పల్లి ( హైదరాబాద్ ) : శాంతి భద్రతల (Law And Order) పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహముద్ అలీ (Minister Mahamood Ali) పేర్కొన్నారు. నూతనంగా నిర్మించిన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ను చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, డీజీపీ అంజనికుమార్, సీపీ స్టీఫెన్ రవీంద్రతో కలిసి గురువారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం జనాభా పెరుగుదలకు అనుకూలంగా నూతన పోలీస్ స్టేషన్లను నిర్మిస్తున్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్(CM KCR) పోలీసు వ్యవస్థను పటిష్ట పరిచారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనటువంటి కమండ్ కంట్రోల్ వ్యవస్థను హైదరాబాద్ నడిబొడ్డులో ఏర్పాటు చేశామని వెల్లడించారు. అనేక నూతన పోలీస్ స్టేషన్లను అత్యాధునికతతో , ఆహ్లదకరమైన వాతావరణంలో నిర్మించామని అన్నారు.
ప్రభుత్వ హయాంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు , కర్ఫ్యూలు జరుగలేదంటే పోలీసులు పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రజలతో స్నేహభావంతో మెలిగి వారి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 64 శాతం సీసీ కెమెరాల(CC Cameras) ఏర్పాటు జరిగిందని వివరించారు . రాష్ట్రంలో నేరాల సంఖ్య(Crime Ratio) గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రహమత్ బేగ్ ,రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, ఏసీపీ గంగాధర్, మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి మధు తదితరులు పాల్గొన్నారు.