హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నిక అక్కడి ప్రజల ఆత్మగౌరవానికి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అహంకారానికి మధ్య జరుగుతున్న పోటీ అని టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. రాజగోపాల్రెడ్డి అక్రమంగా సంపాదించిన కాంట్రాక్టుల ధన బలానికి, మునుగోడు జన బలానికి మధ్యనే పోటీ అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ తరఫున మునుగోడు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేలకోట్ల రూపాయల అక్రమ కాంట్రాక్టులతో సంపాదించిన ధనబలంతో ప్రజలను పట్టించుకోకుండా నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఉప ఎన్నిక తీసుకొచ్చారని విమర్శించారు.
ఈ ఎన్నిక రాజగోపాల్రెడ్డి ధనదాహాన్ని తీర్చేందుకు, వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కోసమే వచ్చిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. గత నాలుగు ఏండ్లలో మునుగోడు నియోజకవర్గాన్ని రాజగోపాల్రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ఆయన ఒక అట్టర్ఫ్లాప్ ఎమ్మెల్యే అని ధ్వజమెత్తారు. నియోజకవర్గ సమస్యలను వదిలేసి అసెంబ్లీలో కాంట్రాక్టర్ల బిల్లుల గురించి మాట్లాడిన ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి అని గుర్తుచేశారు. ఎన్నికల్లో గెలవడం కోసం అనేక హామీలు ఇచ్చి వాటిలో ఏ ఒకదాన్ని నెరవేర్చకుండా చేతులెత్తేసిన రాజగోపాల్రెడ్డి, ఈ ఉప ఎన్నిక సందర్భంగా మరోసారి ప్రజలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
బీజేపీ ఇచ్చిన వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులతో బైకులు, కార్లతో పాటు ఇతర విలువైన వస్తువులను ఓటర్లకు పంచుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. మరో సంవత్సరం పాటు పదవీ కాలం ఉన్నా, స్వార్థ ప్రయోజనాల కోసం ఉప ఎన్నిక తెచ్చారని, చైతన్యవంతులైన మునుగోడు ఓటర్లు బీజేపీకి, రాజగోపాల్రెడ్డికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఒకవైపు బీజేపీ రాజగోపాల్రెడ్డి కాంట్రాక్టు వ్యవహారాన్ని, ఎమ్మెల్యేగా ఆయన విఫలమైన విధానాన్ని ప్రజలకు వివరిస్తూనే టీఆర్ఎస్ గత ఎనిమిదేండ్లలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి చేసిన కార్యక్రమాలను వివరించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ ఉద్బోధించారు.