KTR | మంత్రి కె. తారక రామారావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఆదివారం లేఖ రాశారు. త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు మరియు భవిష్యత్తు ప్రణాళికలకు భారీగా నిధులు కేటాయించాల్సిందిగా కేటీఆర్ ఈ లేఖలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పారిశ్రామిక రంగంతో పాటు అభివృద్ధి పథంలో కూడా తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. వినూత్నమైన విధానాలతో ముందు వరుసలో నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సహాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ అంశంతో పాటు మరిన్ని అంశాలను కూడా కేటీఆర్ ఆ లేఖలో ప్రస్తావించారు.
తెలంగాణలో నేషనల్ డిజైన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని గతంలో అనేకసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిర్మల సీతారామన్ తో జరిగిన చర్చల సందర్భంగా ఆమె సూచన మేరకు నూతన నేషనల్ డిజైన్ సెంటర్ క్యాంపస్ ని ఏర్పాటు చేయడం లేదని, ఇప్పటికే హైదరాబాదులో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో నేషనల్ డిజైన్ సెంటర్ కార్యకలాపాలు కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన పరికరాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కేంద్రం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. నేషనల్ డిజైన్ సెంటర్ కి సంబంధించి 8 సంవత్సరాల పాటు కేంద్రం నుంచి నిర్వహణ ఖర్చు కోరుతున్నామని, ఇందులో 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు నేషనల్ డిజైన్ సెంటర్ కు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కేటీఆర్ కోరారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్ -నాగపూర్ పారిశ్రామిక కారిడార్ లను గుర్తించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ఫార్మా సిటీ, నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్- జహీరాబాద్ నోడ్ల (Nodes) అభివృద్ధికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని మరింత వేగంగా కల్పించాలని కోరారు. ప్రతిపాదిత రెండు నోడ్లలో మౌళిక వసతుల కల్పన చేసేందుకు సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతోపాటు హైదరాబాద్ నాగపూర్ కారిడార్ లో భాగంగా మంచిర్యాల్ నొడ్ ను కొత్తగా గుర్తించాలని ఈ లేఖలో పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ లలోని ఈ మూడు నోడ్లకు రెండు వేల కోట్ల రూపాయల చొప్పున మొత్తం ఆరు వేల కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఇక.. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్- బెంగళూరు, హైదరాబాద్ – విజయవాడ ఇండస్ట్రియల్ కారిడార్ లను జాతీయ ఇండస్ట్రియల్ కారిడార్ కార్యక్రమంలో భాగంగా చేపట్టేందుకు సంసిద్ధంగా ఉన్నదని… ఈ రెండు కారిడార్ల ఏర్పాటును తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా స్వీకరించిందన్నారు. ఇప్పటికే హుజురాబాద్, జడ్చర్ల- గద్వాల్ – కొత్తకోట నొడ్లను ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. ఈ రెండింటికి సంబంధించిన ప్రతిపాదనలు త్వరలోనే కేంద్రానికి పంపుతామన్నారు. ఈ రెండు ఇండస్ట్రియల్ కారిడార్ లలో ఒక్కొదానికి 1500 కోట్ల రూపాయలను(మొత్తం 3000) కనీసంగా రానున్న బడ్జెట్లో కేటాయించాలని మంత్రి కేంద్రాన్ని కోరారు.
గత ఏడు సంవత్సరాల్లో తెలంగాణ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ల పరిధిలో హైదరాబాద్ ను చేర్చాలని మంత్రి కేటీఆర్ ఈ లేఖలో కోరారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్నదని, ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా అత్యంత సులువని మంత్రి వివరించారు. దీనితోపాటు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబరేటరీ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లేబరేటరీ, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, ఈసీఐఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ , బెల్ వంటి అనేక రక్షణ సంస్థలు ఇక్కడ ఉన్నాయన్నారు. వీటితో పాటు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తో పాటు అనేక ఇతర ప్రముఖ ప్రైవేట్ రక్షణ మరియు ఏరోస్పేస్ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. దేశంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడ ఉన్నదన్నారు.
తెలంగాణ ప్రభుత్వం డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ రంగాన్ని ఒక ప్రాధాన్యతా రంగంగా గుర్తించి, ఈ రంగానికి భారీగా పెట్టుబడులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం కూడా చేస్తున్నాదన్నారు. ఇప్పటికే హైదరాబాదులో రెండు ఏరో స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్కులు ఉన్నయని, దీంతోపాటు త్వరలో మరో భారీ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ పార్క్ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. జహీరాబాద్ నిమ్జ్ లోనూ ఏరోస్పేస్ క్లస్టర్ ని సిద్ధం చేసే ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయన్నారు. హైదరాబాద్ నుంచి బోయింగ్, లాక్హీడ్ మార్టిన్, సి కోర్స్స్కి, రువాగ్ వంటి అనేక అంతర్జాతీయ కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీకి హైదరాబాద్ ని ఎంచుకున్నాయన్నారు. ఇక్కడ కనీసం 1000 కి పైగా సూక్ష్మ మధ్యతరహా కంపెనీలు డిఫెన్స్ ఏరోస్పేస్ రంగంలో పనిచేస్తున్నాయన్నారు. ఉన్నత విద్య సంస్థలతోపాటు అద్భుతమైన మానవ వనరులతో డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ రంగానికి కావలసిన అన్ని అవకాశాలు తెలంగాణలో ఉన్న నేపథ్యంలో తెలంగాణను కేంద్రం ప్రతిపాదించిన డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్లో భాగంగా గుర్తించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కోరారు.