హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం పట్ల అడుగడుగునా వివక్షతో వ్యవహరిస్తున్న నరేంద్రమోదీ సర్కార్.. సొంతకాళ్లపై ఎదుగుతున్న తెలంగాణపై మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. తెలంగాణకు దక్కాల్సిన డిఫెన్స్ కారిడార్ను బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్కు కేటాయించింది. దేశంలోనే అత్యంత సురక్షితమైన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎకోసిస్టమ్ ఏర్పాటుకు తెలంగాణ ఎంతో అనుకూలంగా ఉన్నదని అమెరికా వాణిజ్య శాఖ ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ (ఐటీఏ) స్పష్టం చేసినప్పటికీ రాష్ర్టానికి మోదీ సర్కార్ మొండిచెయ్యి చూపడం గమనార్హం. ఏరోస్పేస్ రంగంలోని వ్యవస్థల గురించి అధ్యయనం చేయడం, కొత్త భాగస్వాములను కనుగొనడం, వాటికి అమెరికన్ కంపెనీలను పరిచయడం చేయడం ఐటీఏ లక్ష్యం. భారత్లో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటుకు తెలంగాణ అత్యంత అనువైన ప్రాంతమని ఐటీఏ గుర్తించడంతో 13 అమెరికన్ ఏరోస్పేస్ కంపెనీల ప్రతినిధులు గత నెల 21న హైదరాబాద్ను సందర్శించారు. దేశ రక్షణ రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న డీఆర్డీవో ఇప్పటికే హైదరాబాద్లో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నది.
ఆ సంస్థకు చెందిన 12 ప్రధాన ల్యాబ్లతోపాటు రక్షణ రంగానికి సంబంధించిన పలు ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి. వాటితోపాటు మరో 1,000 వరకు చిన్న, మధ్యతరహా ప్రైవేటు సంస్థలు పనిచేస్తున్నాయి. టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఏరోస్పేస్ సంస్థ 90 శాతానికిపైగా ఉత్పత్తులను హైదరాబాద్లోనే తయారు చేస్తుండగా.. విదేశీ జాయింట్ వెంచర్ల ద్వారా అదానీ, కల్యాణి గ్రూపులు వివిధ ప్రాజెక్టులను స్థాపించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు డిఫెన్స్ కారిడార్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్-బెంగళూరు మధ్య డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ను ఏర్పాటు చేయాలని కోరింది. ఇదే విషయమై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ ఏడాది మే 14న స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రక్షణ సంస్థల ఏర్పాటుకు హైదరాబాద్ అత్యంత సురక్షితమని యావత్ ప్రపంచమంతా గుర్తించిన విషయాన్ని ఆలేఖలో ప్రస్తావించారు. అయినప్పటికీ తెలంగాణ పట్ల మోదీ సర్కార్ మరోసారి కక్షతో వ్యవహరించింది. రాష్ర్టానికి దక్కాల్సిన డిఫెన్స్ కారిడార్ను రూ.20 వేల కోట్ల పెట్టుబడితో ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్కు కేటాయించింది.