హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్నిరకాల పోటీ పరీక్షలను తెలుగు, ఇతర ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్కు ఇవాళ ఆయన లేఖ రాశారు. ‘‘కేంద్ర సర్వీసులు, ఇతర శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఉద్యోగాల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తోపాటు ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు నిర్వహించే పోటీ పరీక్షలకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది పోటీ పడుతున్నారు.
ఈ పరీక్షలను కేవలం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లోనే నిర్వహిస్తున్న కారణంగా ప్రాంతీయ భాషల్లో చదివిన ఉద్యోగార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ గతంలో ప్రధాన మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కేంద్ర మంత్రివర్గం జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేసి జాతీయ పోటీ పరీక్షలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షలను 12 ప్రాంతీయ భాషల్లో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. కానీ క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఆలస్యం జరుగుతున్నది.
తాజాగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFS ) ద్వారా కానిస్టేబుల్ నియామకాలు, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్ మెన్ ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్లలో కేవలం హిందీ, ఇంగ్లిష్లో మాత్రమే పరీక్ష రాసేలా నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధన కారణంగా హిందీయేతర రాష్ట్రాల విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రాంతీయ భాషల్లో జాతీయస్థాయి పోటీ పరీక్షలు రాయలేని వారు ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వంతోపాటు జాతీయస్థాయిలో ప్రభుత్వ అనుబంధ శాఖలు, ఇతర రిక్రూట్మెంట్ బోర్డులు ప్రాంతీయ భాషల్లోనూ ఉద్యోగార్ధులు పరీక్ష రాసేలా అవకాశం కల్పించాలి.
ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న కేబినెట్ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలి’’ అని కేంద్ర మంత్రిని కేటీఆర్ కోరారు. అన్ని ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించేంత వరకు తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లను నిలిపివేయాలని కోరారు. ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసే అవకాశాన్ని కల్పిస్తే అన్ని రాష్ట్రాల యువతకు సమాన అవకాశాలు దక్కుతాయని కేటీఆర్ లేఖలో అభిప్రాయపడ్డారు.