Minister KTR | తొర్రూరు : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని( Womens Day ) పురస్కరించుకొని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం పాలకుర్తి( Palakurthy ) నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో( Errabelli Dayaker Rao ) కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం తొర్రూరు పట్టణ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో కేటీఆర్ సమీక్షించనున్నారు. ఆ తర్వాత 20 వేల మంది మహిళలతో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడతారు. అలాగే అదే రోజు మహిళా దినోత్సవ కానుకగా, రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు రూ. 750 కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళలకు చెక్కుల రూపంలో అందజేయనున్నారు. అలాగే అభయ హస్తం డబ్బులను కేటీఆర్ డ్వాక్రా మహిళలకు అందిస్తారు.
ఈ సభ ఏర్పాట్లు, కేటీఆర్కు స్వాగతం పలుకుతూ చేసే బైక్ ర్యాలీ, వివిధ ప్రారంభోత్సవాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి తొర్రూరులో పరిశీలించారు. అనంతరం పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో ఏర్పాట్లపై చర్చించారు. అలాగే అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి, హెలిప్యాడ్, బహిరంగ సభా స్థలం, పార్కింగ్ స్థలాలను మంత్రి ఎర్రబెల్లి పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. కేటీఆర్ సభ విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. మహిళ దినోత్సవం రాష్ట్రమంతా ఘనంగా జరుపుకోవాలి అన్నారు. తొర్రూరులో జరిగే రాష్ట్ర స్థాయి ఉత్సవాలకు మంత్రి కేటీఆర్ వస్తున్నారు ఈ ఉత్సవాలలో మొత్తం రూ. 750 కోట్ల నిధులను మహిళా దినోత్సవం కానుకగా మహిళల స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకు అందిస్తున్నామన్నారు. రూ. 250 కోట్లు పట్టణ ప్రాంతాల మహిళల కోసం కాగా, రూ. 500 కోట్లు గ్రామీణ మహిళల కోసమని మంత్రి తెలిపారు. మహిళలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అభయ హస్తం నిధులు కూడా విడుదల చేస్తున్నామన్నారు.
అలాగే రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి, 5 కోట్ల 10 లక్షలతో మొదటి విడతగా 3 వేల మందికి కుట్టు శిక్షణ ఇస్తున్నామని, విడతల వారీగా పాలకుర్తి నియోజకవర్గంలో 10 వేల మందికి కుట్టు శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. అనంతరం ఈ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి వివరించారు. కుట్టు శిక్షణ పొందిన పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన 500 మంది మహిళలకు కుట్టు మిషన్లు మంత్రి కేటీఆర్ అందిస్తారని మంత్రి చెప్పారు.