Minister KTR | నిజాంసాగర్, మార్చి 14: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11.30 గంటలకు నిజాంసాగర్ మండలం గోర్గల్ శివారులోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. ఉద యం 11.45 గంటలకు నిజాంసాగర్లో మంజీర నదిపై రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెనను ప్రారంభిస్తారు. దీంతో తెలంగాణ-కర్ణాటక రాష్ర్టాల మధ్య రాకపోకలు సాఫీగా సాగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు జక్కాపూర్ శివారులో నాగమడుగు మత్తడి పనుల పైలాన్ ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పిట్లం మండలం అన్నారంలో భోజనం చేస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పిట్లంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నిజాంసాగర్ మండలం గోర్గల్ శివారులోని హెలిప్యాడ్కు చేరుకొని హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు.
జుక్కల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు సాగునీటి వసతి కల్పించేందుకు నిజాంసాగర్ మండలం వడ్డెపల్లి-కొమలంచ శివారులో గల మంజీరపై రూ.476.25 కోట్ల వ్యయంతో మత్తడి, పంప్హౌస్ నిర్మాణానికి నిర్ణయించారు. ప్రస్తుతం మత్తడి పనులు చురుగ్గా సాగుతున్నాయి. మత్తడి వల్ల మంజీర నదిలో నిలిచే నీటిని పంప్హౌస్కు తరలించి అక్కడి నుంచి పైప్లైన్ ద్వారా చెరువులకు ఎత్తిపోయనున్నారు. తద్వారా నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్గల్, బిచ్కుంద మండలాల్లోని 47 గ్రామాలకు చెందిన 40,768 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలుగనున్నది.