నూలు తీయడం నుంచి చీర తయారీ దాకా అంతా ఒకే చోట. చీరలకు ప్రసిద్ధిగాంచిన భూదాన్ పోచంపల్లిలో ఏర్పాటైన ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్లో నూలు, చిటికీలు, వార్పు, టై అండ్ డైయింగ్, మగ్గాలు చీరల తయారీ అన్నీ ఒకే దగ్గర నడుస్తున్నాయి. తెలంగాణ టెక్స్టైల్స్ & అపారెల్ పాలసీ కింద రాష్ట్రం అందించిన ప్రోత్సాహంతో ఏర్పాటైన ఈ యూనిట్ను నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
Pochampally | యాదాద్రి భువనగిరి, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): చీరలకు ప్రసిద్ధిగాంచిన భూదాన్ పోచంపల్లి మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. పట్టు నూలు తీయడం మొదలుకొని పట్టు చీర తయారీ దాకా అంతా ఒకేచోట జరగనున్నది. చీరల అమ్మకాలు సైతం ఇక్కడే జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మొట్టమొదటిసారిగా భూదాన్ పోచంపల్లిలో ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్ ఏర్పాటైంది. రాష్ట్రంలో ఎక్కడాలేని ప్రత్యేక, హెవీ డిజైన్లు ఇక్కడ తయారు కానున్నాయి. నూలు, చిటికీలు, వార్పు, టై అండ్ డైయింగ్, మగ్గాలు, చీరల తయారీ ఇలా అన్నీ ఒకే దగ్గర నడుస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు దేశ, విదేశాల నుంచి పెద్దఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా సుమారు 100 మంది దాకా ఉపాధి పొందనున్నారు. దీన్ని శనివారం మంత్రి కే తారకరామారావు ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలో తొలిసారి
భూదాన్ పోచంపల్లి పట్టణానికి చెందిన సాయిని భరత్ ఎంటెక్ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి చేనేత అంటే మక్కువ. మగ్గం నేస్తూనే చదువు కొనసాగించాడు. చేనేత రంగంలో ఏదైనా కొత్తగా చేయాలని, నేతన్నలను ఆదుకోవాలని పరితపిస్తుండేవాడు. ఇందులో భాగంగా కొత్త డిజైన్లు రూపొందించాడు. డిజైన్ల తయారీలో కేంద్ర ప్రభుత్వం నుంచి, లిమ్కా బుక్, తెలంగాణ బుక్, కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం వంటి ఎన్నో అవార్డులు పొందాడు. మంత్రి కేటీఆర్ను కలిసి తన డిజైన్లను వివరించాడు. మంత్రి సైతం ప్రోత్సాహం ఇవ్వటంతో మరింత ముందుకెళ్లాడు. సుమారు రూ.4 కోట్లతో భూదాన్ పోచంపల్లిలో ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్ను ఏర్పాటు చేశాడు. ప్రభుత్వం నుంచి 25 శాతం ప్రోత్సాహకాలు అందుతాయి. తెలంగాణ టెక్స్టైల్స్ అండ్ అపారెల్ పాలసీ కింద రాష్ట్రంలో ఇలాంటి యూనిట్ ఉండటం ఇదే మొదటిది.
తయారీ అంతా ఒకే దగ్గర
సాధారణంగా చేనేతకు సంబంధించి అన్ని పనులు ఒకే దగ్గర జరగవు. నూలు, చిటికీలు, వార్పు బయట నుంచి కొనుగోలు చేస్తారు. టై అండ్ డైయింగ్ మరోచోట కార్మికులతో చేయిస్తారు. నేయడానికి ప్రత్యేకంగా నేత కార్మికులు ఉంటారు. ఇక అమ్మకాలు మరో చోట జరుగుతాయి. కానీ, ఇవన్నీ ఒకేచోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్ను ఏర్పాటు చేశారు. జీ+2 బిల్డింగ్లో కార్యకలాపాలు నడుస్తాయి. గ్రౌండ్ ఫ్లోర్లో చీరల సేల్స్ షోరూమ్, మగ్గాలు, పక్కన షెడ్లో టై అండ్ డైయింగ్ పని, మొదటి అంతస్థులో 25 మగ్గాలు ఉన్నాయి. రెండో అంతస్థులో దారం తయారీ జరుగుతుంది. బెంగళూరు నుంచి ఒక పోగు ముడిసరుకు తీసుకొచ్చి.. ఇక్కడే మిషన్లపై మూడు పోగులు, ఐదు పోగుల దారం తయారు చేస్తారు. వీటి ద్వారా వార్పులు, చిటికీలకు నూలు తయారు చేస్తారు. ఇక్కడ ఒక్కోటి రూ.30 లక్షల విలువైన రెండు ఎలక్ట్రానిక్ జకాట్ మగ్గాలు కూడా ఉండటం విశేషం.
స్పెషల్ డిజైన్లు సొంతం
ఎక్కడా లేనివిధంగా ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ మార్కెట్లో అత్యంత కష్టమైన డిజైన్లతో చీరెలు తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఇంగ్లిష్ కలర్స్ వాడి చీరలు తయారు చేస్తారు. సాధారణంగా ఆసుపై 40 కొయ్యలతో డిజైన్లు తయారు చేస్తారు. కానీ.. ఇక్కడ ఏకంగా మడత ఆసుపై 300 కొయ్యలతో అనేక రకాల కొత్త కొత్త డిజైన్లతో చీరలను నేస్తారు. చీర రకాన్ని బట్టి ఒక్కోటి రూ.8 వేల నుంచి రూ.2 లక్షల వరకు ధర ఉంటుంది.
కేటీఆర్ వెన్నుతట్టి ప్రోత్సహించారు
నాకు చిన్నప్పటి నుంచి కొత్త డిజైన్లు తయారు చేయడం ఫ్యాషన్. చీరలపై పొట్రెయిట్ బొమ్మలు వేయటంతో పలు అవార్డులు వచ్చాయి. ఇంకా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మంత్రి కేటీఆర్ను కలిసి వివరించాను. ఆయన వెన్ను తట్టి ప్రోత్సహించారు. యూనిట్ ఏర్పాటుపై సూచనలు చేశారు. ప్రోత్సాహకాలు అందిస్తామని భరోసా కల్పించారు. దీంతో ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్ ఏర్పాటు చేశాను.
– సాయిని భరత్, ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ మార్కెట్ స్థాపకుడు