హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టుగా తెలంగాణకు ఏనాటికైనా స్వీయ రాజకీయ అస్థిత్వమే శ్రీరామ రక్ష అని, ఎన్నటికైనా తెలంగాణకంటూ ఉన్న రాజకీయ గొంతుక బీఆర్ఎస్ మాత్రమేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నాడు జయశంకర్సార్ చెప్పిన మాట మేరకు తెలంగాణ ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
50 ఏండ్ల కాంగ్రెస్ అరాచకాలు, మోసాలను గుర్తు చేసుకుంటూ 29న ‘దీక్షా దివస్’ను దేశ, విదేశాల్లో, తెలంగాణవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని శ్రేణులు, ఉద్యోగ సంఘాలు, సకలజనులకు పిలుపునిచ్చారు. నవంబర్ 29.. దేశ రాజకీయాల్లో అద్భుతమైన ఘట్టానికి బీజంపడిన రోజు అని చెప్పారు. 75 ఏండ్ల భారత రాజకీయాల్లో ఎన్నో పార్టీలు వచ్చి వెళ్లినా.. ఒక లక్ష్యం కోసం, ఒక స్పష్టమైన అజెండాతో పార్టీని పెట్టడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ‘ఉద్యమం నుంచి నేను తప్పుకొంటే.. తెలంగాణను నేను తేలేకపోతే.. రాళ్లతో కొట్టి చంపండి’ అని చెప్పినా.. ‘నేను ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరి వెళ్తున్నాను. తిరిగి తెలంగాణలోనే కాలు పెడతాను’ అని ఒక శపథం చేసినా.. ‘కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో..’ ‘అయితే నా శవయాత్ర లేకపోతే తెలంగాణ జైత్రయాత్ర’ అని నినదించినా అది కేసీఆర్కే చెల్లిందని పేర్కొన్నారు.
చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు. 15 ఏండ్ల క్రితం నవంబర్ 29న కరీంనగర్లో బయలుదేరి అలుగునూరు చౌరస్తా నుంచి ఖమ్మం జైలుకు పోయేదాకా.. అక్కడినుంచి నిమ్స్ దవాఖానకు వచ్చేదాకా జరిగిన ఘట్టాలెన్నో అందరికీ గుర్తున్నాయని తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యం క్షీణించినా, ప్రాణాలకే ప్రమాదమని తెలిసినా, ఎందరో బతిమిలాడినా, ఆత్మగౌరవ విశ్వరూపం చూపించి, ఆ పట్టుదలలోంచి పార్లమెంట్లో ప్రకంపనలు పుట్టించిన ధీరత్వం కేసీఆర్దని గుర్తు చేశారు. 14 ఏండ్లుగా 29 నవంబర్న కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షకు గుర్తుగా, తెలంగాణ సమాజాన్ని కార్యోన్ముఖులను చేసిన కేసీఆర్ పోరాట స్ఫూర్తికి ప్రతీకగా, తన జాతి విముక్తికి చిహ్నంగా ‘దీక్షా దివస్’ను జరుపుకుంటున్నామని కేటీఆర్ వివరించారు. ఈ నవంబర్ 29తో 15వ ఏటకు చేరుకొన్నదని, ఈ ఏడాది కూడా దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. మోదీని ప్రశ్నించే దమ్ము రేవంత్కు లేదని, ఎందుకంటే ఆయనది ఏబీవీపీ, ఆర్ఎస్సెస్ బ్యాగ్రౌండ్ అని విమర్శించారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఉన్నదని తెలిపారు. ‘రేవంత్కు నిజంగానే బీజేపీపై పోరాడాలని ఉంటే గోషామహల్, కరీంనగర్, కోరుట్లలో డమ్మీ అభ్యర్థులను ఎందుకు పెట్టిండు? ఎవరికోసం? రాజాసింగ్, బండిసంజయ్, ధర్మపురి అర్వింద్ను గెలిపించుకోవాలనే తాపత్రయం ఎందుకు? నేను చెబుతున్నా.. ఈసారి రాజాసింగ్, బండి సంజయ్, అర్వింద్ను ఓడిస్తాం. ఈ దేశంలో బీజేపీని నిలువరించే సత్తా బీఆర్ఎస్వంటి ప్రాంతీయ పార్టీలకే ఉన్నది. కాంగ్రెస్కు ఆ సత్తా లేదు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ అస్త్రసన్యానం చేసింది’ అని అన్నారు. కేంద్రంలోని బీజేపీ పీఎం కిసాన్ వేస్తే రేవంత్కు కనిపించదా? చీమకుట్టినట్టు కూడా ఉండదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సర్కారు రైతుబంధు ఇస్తుంటే రేవంత్కు వచ్చిన నొప్పేంటి? అని మండిపడ్డారు.
రేవంత్, కర్ణాటక డిప్యూటీ సీఎం చేస్తున్న ప్రకటనలతో కరెంటుపై కాంగ్రెస్ వైఖరి స్పష్టమైందని కేటీఆర్ తెలిపారు. రేవంత్ 3 గంటల కరెంటే అంటున్నారని, డీకే శివకుమార్ 5 గంటలు అంటున్నారని.. తాము 24 గంటలు అంటున్నామని చెప్పారు. కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదని స్పష్టం చేశారు. 3,5 గంటల కాంగ్రెస్ కావాల్నా? 24 గంటలకరెంటు కావాల్నా? ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ను నమ్మి తాము మోసపోయామని, తెలంగాణ ప్రజలు మోసపోవద్దని అక్కడి రైతులు ఇక్కడికొచ్చి మరీ చెప్తున్నారని అన్నారు. అలాంటప్పుడు కర్ణాటక నేతలను ఇక్కడెవరు నమ్ముతారని, పత్రికా ప్రకటనలు కాదు.. వాళ్లు ఇక్కడ బట్టలు చింపుకున్నా పట్టించునేవారే ఉండబోరని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ పేరు మారుస్తానంటున్న యూపీ సీఎం యోగీ.. తన పేరే మార్చుకున్నారని, ఆయన ఇలాంటి అంశాలపై కాకుండా ఉత్తర ప్రదేశ్ అభివృద్ధిపై దృష్టిపెడితే ఇంకా బాగుంటుందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ నిరుద్యోగం చాలా తక్కువగా ఉన్నదని, ఇక్కడ నిరుద్యోగం ఉన్నదని చెప్తున్న కాంగ్రెస్ నేతలే రాజకీయ నిరుద్యోగులు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 2014 నుంచి రాహుల్గాంధీ రాజకీయ నిరుద్యోగిగానే ఉన్నారని చురకలంటించారు. ‘రాహుల్ గాంధీకి దమ్ము, ధైర్యం ఉంటే నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వా లి. పదేండ్లలో తెలంగాణతోపాటు ఏ రాష్ట్రమైనా అధికంగా ఉద్యోగాలు ఇచ్చిందా? ఉంటే చూపించాలి. మేము పదేండ్లలో లక్షా 60 వేల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చాం. ఇదే రాహుల్గాంధీ ఏడాదిలోపు కర్ణాటకలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని, మొదటి క్యాబినెట్లో సంతకం పెడతామని చెప్పారు. వచ్చి ఆరు నెలలైంది.. ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇచ్చారా? దమ్ముంటే చెప్పాలి. కర్ణాటక యువతను మోసం చేయలేదా? రాహుల్ తన జీవితంలో ఎన్నడైనా ఉద్యోగం చేసిండా? ఒక ప్రవేశ పరీక్ష రాసిండా? రేవంత్ ఏమైనా ఉద్యో గం చేసిండా? ఇలాంటి వాళ్లా వచ్చి మాట్లాడేది’ అని సవాల్ విసిరారు.
పుట్టకతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టినోళ్లు నిరుద్యోగుల గురించి మాట్లాడితే ఎలా నమ్మాలి? అని ప్రశ్నించారు. రాజకీయ నిరుద్యోగులను నమ్మి మోసపోవద్దని యువతకు సూచించారు. తాము తప్పు లు సవరించుకుంటామని, టీఎస్పీస్సీని ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. డిసెంబర్ 4న అధికారులతో కలిసి స్వయంగా అశోక్నగర్ వస్తామని, ఉద్యోగార్థులతో కూర్చుంటామని, అందరి సమక్షంలో జాబ్ క్యాలెండర్ తయా రు చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఏ ప్రిల్ 1న జ్యాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులను ఫూల్స్ను చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని, అది రాహుల్ పప్పు దినోత్సవమని, పార్లమెంట్ నోటిఫికేషన్ సమయంలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
తెలంగాణవ్యాప్తంగా ఉన్నవారికి నా విజ్ఞప్తి.. దీక్షా దివస్ను ఘనంగా, చైతన్యవంతం చేసేలా నిర్వహించాలి. 50 ఏండ్లపాటు జరిగిన దాష్టీకాలను గుర్తు చేసుకుంటూ, సిటీకాలేజీ దగ్గర అమరులైన విద్యార్థులను తలచుకొంటూ, 1956లో మన ఇష్టంలేకుండానే ఆంధ్రా కలిపిన దారుణాన్ని తలుచుకొంటూ కార్యక్రమాన్ని నిర్వహిద్దాం. 1968లో 371 మందిని కాల్చి చంపిన వారి క్రూరత్వాన్ని బయటపెడుతూ.. మన బిడ్డల ఆత్మ బలిదానాలకు అర్థంలేకుండా చేసిన వారి కుటిలత్వాన్ని మననం చేసుకుంటూ కార్యక్రమాలు చేద్దాం. 2004 నుంచి 2014 వరకు వందల మంది తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమైన వారిని గుర్తుపెట్టుకొని దీక్షా దివస్ను నిర్వహిద్దాం.
-మంత్రి కేటీఆర్
తెలంగాణ నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లినవారికోసం ప్రత్యేకంగా గల్ఫ్ పాలసీని తీసుకొస్తామని, రైతు బీమా తరహాలోనే గల్ఫ్కు వెళ్లిన కార్మికులకు గల్ఫ్ బీమాను అమలుచేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే జనవరిలో గల్ఫ్ పాలసీని అమలుచేస్తామని సిరిసిల్ల రోడ్ షోలో ప్రకటించారు. గల్ఫ్ పాలసీ కింద వివిధ సంక్షేమ కార్యక్రమాలను కూడా తీసుకొని వస్తామని చెప్పారు.
కేసీఆర్, ఓవైసీ ఒక్కటేనని రాహుల్గాంధీ అంటున్నారనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. రాహుల్గాంధీ తీరు దొంగే దొంగా దొంగా అని అరిచినట్టుగా ఉన్నదని కేటీఆర్ చురకలంటించారు. రాహుల్గాంధీ, మోదీ ఒక్కటేనని, వీరిద్దరూ కలిసే దొంగనాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. యూపీలోని సొంత నియోజకవర్గం అమేధిలో ఓడిపోయిన రాహుల్గాంధీ తెలంగాణలో ఏంచేస్తారని ప్రశ్నించారు. బెంగాల్, ఢిల్లీలో, తమిళనాడు, తెలంగాణలో ప్రజలు బీజేపీని తరిమికొట్టారని చెప్పారు. ఇప్పటికీ బీజేపీని ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్కు లేదని అన్నారు. మోదీ, అమిత్షా, యోగిలాంటివారు ఎంతమంది వచ్చి ఏం చెప్పినా.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోదని చెప్పారు. ఉమ్మడి పౌరస్మృతిపై తమ వైఖరి ఇప్పటికే చెప్పామని, దానికే కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.