నాగర్కర్నూల్ : కృష్ణా జలాల్లో వాటాను తేల్చడంలో కేంద్రం విఫలమైందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండాపూర్, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇతర పార్టీల నాయకుల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనుకునే ప్రభుత్వం ఇది అని కేటీఆర్ పేర్కొన్నారు.
నాగర్కర్నూల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా బిజినేపల్లిలో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి నాగర్కర్నూల్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. హైదరాబాద్ ట్యాంక్బండ్ మాదిరిగానే స్థానికంగా ట్యాంక్బండ్ నిర్మించడం గొప్ప విషయమన్నారు. ఒక శాసనసభ్యుడికి తన నియోజకవర్గం, ప్రజలపై ప్రేమ ఏ విధంగా ఉంటదో మర్రిని చూసి గర్వపడాలన్నారు. నాగర్కర్నూల్ నడిబొడ్డున 3 ఎకరాల్లో 12 కోట్లతో వెజ్ – నాన్ వెజ్ మార్కెట్ను నిర్మించబోతున్నారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇంటింటికీ నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. మున్సిపల్ కార్యాలయం, కొత్త లైబ్రరీకి భూమి పూజ చేసుకున్నాం.
పాలెం సుబ్బయ్య ఆనాడే.. పట్టుదలతో ఒక కాలేజీ ఏర్పాటు చేశారు. సుబ్బయ్య ఎమ్మెల్యే కాకపోయినా ఆయన చేసిన పనిని ఎమ్మెల్యేలు ఎవరూ చేయలేకపోయారు. కనీసం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీని కూడా తీసుకురాలేకపోయారు. మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ఘనత మర్రి జనార్ధన్ రెడ్డికే దక్కుతుందన్నారు. బిజినేపల్లి మండలంలో 20 తండాలకు సాగునీరు ఇచ్చేందుకు రూ. 77 కోట్లతో మార్కండేయ ఎత్తిపోతలకు భూమి పూజ చేశామన్నారు. నాగర్కర్నూల్కు మినీ స్టేడియం మంజూరు చేస్తామన్నారు. నాగర్కర్నూల్ బాగుపడాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. మర్రి నాయకత్వంలోనే మళ్లీ ఎన్నికలకు పోతాం. రాబోయే ఎన్నికల్లో మర్రిని లక్షకు పైగా మెజార్టీతో గెలిపించాలి. నాగర్కర్నూల్కు ఉజ్వలమైన భవిష్యత్ ఉంటదని కేటీఆర్ స్పష్టం చేశారు.