రాజన్న సిరిసిల్ల : భారత్లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజును గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. త్యాగధనులను స్మరించుకుంటూ ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణకు పోరాటాలు కొత్త కాదన్నారు. 1948లో రాచరిక ప్రభువుపై, 1956లో ఆంధ్రాలో విలీనమైనప్పుడు, 1960 దశకంలో తెలంగాణ కోసం, 2001లో కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కోసం పోరాటం జరిగి లక్ష్యాన్ని ముద్దాడిందని గుర్తు చేశారు. తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయమని పేర్కొన్నారు.
అంబేద్కర్ దార్శనికత వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని కేటీఆర్ తెలిపారు. ఎంతో మంది త్యాగాలతో సిద్ధించిన తెలంగాణను కులం, మతం పేరుతో విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ సమైక్యంగా ఉండాలనే సమైక్యత
వేడుకలు జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. మతపిచ్చి, వైషమ్యాల మాయలో పడితే తెలంగాణ దశాబ్దాల వెనుకబాటుకు వెళ్తుందన్నారు. చిల్లర మాటలు, పంచాయితీలతో తెలంగాణకు ఒరిగేదేమీ ఉండదని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ వచ్చిన తర్వాత సంక్షేమానికి రాష్ట్రం ట్రేడ్ మార్క్గా నిలిచిందన్నారు. జిల్లాలో 85 నుంచి 90 శాతం కుటుంబాలకు పెన్షన్ అందుతుందన్నారు. సిరిసిల్ల జిల్లాకు కొత్తగా 17 వేల పెన్షన్లు మంజూరు చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. కరెంట్, నీళ్ల వ్యవస్థ కూడా మెరుగు పడిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కార్యక్రమాలు జిల్లాలో చేపడుతున్నామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఒక్కటే డిగ్రీ కాలేజీ ఉండేదని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు జిల్లాలో వ్యవసాయ, పాలిటెక్నిక్ కళాశాల సహా అనేక కళాశాలలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. త్వరలో మెడికల్ కళాశాల కూడా రానుందని కేటీఆర్ చెప్పారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకల్లో మంత్రి @KTRTRS పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ప్రభుత్వం ఎంపిక చేసిన నూతన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఫించన్ కార్డులను అందజేశారు. pic.twitter.com/6sXT9KNmDD
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 16, 2022