ఖైరతాబాద్/ఖమ్మం, ఏప్రిల్ 13: చీమలపాడు అగ్నిప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రమాద బాధితులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లా చీమలపాడు అగ్ని ప్రమాద క్షతగాత్రులను గురువారం మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి కేటీఆర్ పరామర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగానే ఉన్నదని తెలిపారు. ఇన్ని రోజులు తమతో ఉన్న పార్టీ కుటుంబ సభ్యులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం బాధను కలిగిస్తున్నదని తెలిపారు. బాధితులంతా గిరిజనులేనని, వారందరికీ ప్రభుత్వం, పార్టీ పరంగా అండగా ఉంటామని తెలిపారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి కూడా బాధితులను పరామర్శించారు.
బోన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా
నిమ్స్లో కేటీఆర్ను బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన టీ వినయ్, అతని తల్లి కవిత కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. వెంటనే మంత్రి స్పందిస్తూ ఎల్వోసీ తెప్పించి పూర్తి స్థాయిలో చికిత్స అందించాలని నిమ్స్ అధికారులను ఆదేశించారు.
చీమలపాడు ఘటన కలిచివేసింది
మంత్రి పువ్వాడ
ఖమ్మం, ఏప్రిల్ 13: చీమలపాడు ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఈ ఘటనతోపాటు తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు అనారోగ్య పరిస్థితుల కారణంగా ఈ నెల 19న తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తన జన్మదిన సంబురాలకు బదులుగా ఆ రోజు స్థానికంగా ఇబ్బందుల్లో వారికి సహాయం చేయాలని కోరారు.