నల్లగొండ : హిందువులు, ముస్లింలు, క్రైస్తవులే కాదు.. సిక్కులు, బౌద్ధులు, జైనులు, అందరూ కూడా సంతోషంగా, అన్నదమ్ముల్లాగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పరమత సహనం, ఇతర మతాలను గౌరవించడం, ఒకరినొకరు ద్వేషించుకోకుండా, ఒకరినొకరు గౌరవించుకునే సంస్కృతి ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని కేటీఆర్ తెలిపారు. నాగార్జున సాగర్లో నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
బుద్ధవనం ప్రాజెక్టు నిర్మాణానికి విశేష కృషి చేసిన మల్లెపల్లి లక్ష్మయ్య, శివనాగిరెడ్డితో పాటు ఈ నిర్మాణంలో రాళ్లు మోసిన కూలీల నుంచి మొదలు పెడితే.. ఆకృతులను చెక్కిన శిల్పులు.. కొన్ని వేల మంది ఈ నిర్మాణంలో పని చేసి ఉంటారు. వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ఇవాళ మనం ఆవిష్కరించుకున్నది, ప్రారంభించుకున్నది సామాన్యమైన నిర్మాణం కాదు. గౌతమ బుద్ధుడు మన దేశంలో పుట్టడమే మనకందరికీ ఎంతో గర్వకారణం. ఒక చైనాకో, జపాన్కో, దక్షిణ కొరియాకో, తైవాన్కో లేదా థాయిలాండ్ లాంటి దేశాలకు వెళ్లినప్పుడు గౌతమ బుద్ధుడిని వారు కొలిచే విధానం, ఆరాధించే విధానం అపురూపమైన పద్ధతుల్లో కనిపిస్తుందని కేటీఆర్ తెలిపారు.
15, 20 ఏండ్ల కిందట కుటుంబమంతా కలిసి బోద్ గయకు వెళ్లాం. అక్కడున్న బౌద్ధులు చెప్తుంటారు.. బుద్ధం శరణం గచ్చామి.. సంఘం శరణం గచ్చామి.. ధర్మం శరణ గచ్చామి.. దానికి అనుగుణంగా ఆ మార్గంలో ఈ దేశం నడిచి ఉంటే ఇప్పుడున్న దురవస్థలు, సమాజంలో ఉన్న అవలక్షణాలు ఉండేవి కావు అనిపిస్తదని కేటీఆర్ పేర్కొన్నారు.
గౌతమ బుద్ధుని శిష్యుడు నాగార్జునుడు గడిపిన ఈ కొండ ప్రాంతానికి నాగార్జున కొండ అని పేరు వచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు.. ఈయనను రెండో గౌతమ బుద్ధ అని కూడా అంటారు. అలా ఈ ప్రాంతానికి నాగార్జున సాగర్ అని పేరొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఫణిగిరి(సూర్యాపేట), నేలకొండపల్లి(ఖమ్మం), ధూళికట్ట(కరీంనగర్), ఆదిలాబాద్ జిల్లాలోనూ బౌద్ధానికి సంబంధించిన స్థూపాలు, చిహ్నాలు కనబడుతాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉండే బౌద్ధులు బుద్ధుడు పుట్టిన ప్రాంతం భారతదేశం అని చాలా గర్వంగా చెప్పుకుంటారు. మహ్మదీయులు మక్కాకు, హిందువులు తమ ఆరాధ్య దైవ ప్రాంతాలకు, యూదులు జేరూసలేం, క్రిస్టియన్స్ వాటికన్ పోయినట్లు, అదే విధంగా బౌద్ధులు కూడా మన దేశానికి తరలివచ్చే విధంగా, ఈ దేశంలో ఉండే బౌద్ధారామాలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనపై ఉందని లక్ష్మయ్య చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్కు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంత చక్కటి నిర్మాణాన్ని పూర్తి చేసిన లక్ష్మయ్య, శివనాగిరెడ్డికి, టూరిజం మంత్రితో పాటు ఆయా బృందాలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. 274 ఎకరాల్లో మనం కేవలం 90 ఎకరాలు మాత్రమే వినియోగించుకున్నాం. మిగతా స్థలాన్ని కూడా వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. లక్ష్మయ్య కోరినట్టు నిధుల కేటాయింపునకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కేటీఆర్ చెప్పారు.
ఈ ప్రాంతంలో బౌద్ధానికి సంబంధించిన యూనివర్సిటీని నెలకొల్పేందుకు కొంతమంది ముందుకు వచ్చారని లక్ష్మయ్య చెప్పిన విషయాన్ని కేటీఆర్ వెల్లడించారు. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని, అన్ని సవ్యంగా ఉంటే ఏర్పాటుకు చర్యలు తీసుకోవచ్చన్నారు. చాకలిగుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పబ్లిక్ ప్రయివేటు పార్ట్నర్ షిప్ మోడల్లో ఒక ఆకర్షణీయ స్థలంగా, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా నాగార్జున సాగర్ను తీర్చిదిద్దాలి. దీంతో ఇక్కడి పిల్లలకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ స్పష్టం చేశారు.