వరంగల్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): మంత్రి కేటీఆర్ శనివారం వరంగల్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేసి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గీసుగొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ్వన్ కంపెనీ రూ.840 కోట్లతో నిర్మించే వస్త్ర పరిశ్రమలకు శంకుస్థాపన చేసి, మొక్కలు నాటారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలో మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే నరేందర్తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. వరంగల్ ఓసిటీలో రూ.3.5 కోట్లతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. అజాంజాహి మిల్స్ గ్రౌండ్లో రూ.80 కోట్లతో సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. దేశాయిపేటలో రూ.12.6 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. రూ.4 కోట్లతో జిల్లా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కు శంకుస్థాపన చేశారు. కొత్తవాడలో రూ.43 లక్షలతో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్బాపూజీ, చేనేతన్న విగ్రహాలను ఆవిష్కరించారు.
మండిబజార్లో రూ.5.5 కోట్ల నిధులతో ఈద్గాలు, మసీద్లు, దర్గాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.135 కోట్లతో నిర్మించిన 16 స్మార్ట్ రోడ్లను వరంగల్ చౌరస్తా వద్ద ప్రారంభించారు. రూ.75 కోట్లతో వరంగల్ మోడ్రన్ బస్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వరంగల్ ఆర్టీఏ జంక్షన్ సమీపంలో రూ.313 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఉర్సులో రూ.15 కోట్లతో నిర్మించిన ఎస్టీపీని ప్రారంభించారు. రంగలీలా మైదానం వద్ద ఉర్సుగుట్ట బండ్, వాటర్ సప్లయ్ ప్రాజెక్టు, పట్టణ ప్రగతి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.2 కోట్లతో కల్చరల్ భవనానికి శంకుస్థాపన చేశారు. రూ.83 లక్షలతో దర్గాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రంగశాయిపేటలో రూ.4 కోట్లతో కుడా ఆధ్వర్యంలో చేపట్టిన స్మార్ట్ పనులకు శంకుస్థాపన చేశారు. చారిత్రక ఖిలావరంగల్ రాతికోట ఉత్తర ద్వారం వద్ద రూ.8.97 కోట్లతో ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లను ప్రారంభించారు.
స్వీయ అంచనా, ధ్రువీకరణతో మంచి ఫలితాలు: మంత్రి కేటీఆర్
ప్రభుత్వం ప్రజల మీద నమ్మకం, విశ్వాసం ఉంచినప్పుడు తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు శనివారం ఓ ట్వీట్లో పేర్కొన్నారు. టీఎస్ ఐపాస్, టీఎస్ బీపాస్ వంటి చట్టాలను రూపొందించినప్పుడు స్వీయ అంచనా, స్వీయ ధ్రువీకరణ అనేవి సీఎం కేసీఆర్ మదిలో నుంచి పుట్టాయని తెలిపారు. ఈ రెండు చట్టాలు ప్రజలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు సులభంగా అనుమతులు రావడంలో, పారదర్శకత తీసుకరావడంలో విప్లవాత్మకమైనదని పేర్కొన్నారు.