అమెరికన్ కంపెనీలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న పలు కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలు ప్రకటిస్తుండగా, అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో అడుగు పెట్టేందుకు ఆసక్తిని చూపుతున్నాయి.
అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. ఒకవైపు ఆయన వరుస భేటీల ఫలితాలు రాష్ర్టానికి పెట్టుబడులను మోసుకొస్తున్నాయి. తాజాగా తెలంగాణలో భారీ పెట్టుబడులకు సిద్ధమైన సంస్థల వరుసలో కస్టమర్ సర్వీసుల గ్లోబల్ దిగ్గజం వీఎక్స్ఐ సొల్యూషన్స్ కూడా చేరింది.
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): మరో అంతర్జాతీయ సంస్థ తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. టెక్నాలజీ రంగంలో వినియోగదారులకు వినూత్న సేవలందించడంలో దిగ్గజ సంస్థగా పేరుగాంచిన బైన్ క్యాపిటల్కు చెందిన వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ హైదరాబాద్లో తమ డెలివరీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నది. ఇందులో దశలవారీగా 10 వేల మంది నిపుణులకు ఉద్యోగాలు కల్పించనున్నారు. మొదటి రెండుమూడు సంవత్సరాల్లోనే 5000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్టు సంస్థ వర్గాలు తెలిపాయి. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావుతో వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ గ్లోబల్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ ఎరికా బోగర్కింగ్ ఆదివారం హ్యూస్టన్లో సమావేశమయ్యారు.
తమ సంస్థకు చెందిన డెలవరీ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటుచేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. తొమ్మిదేండ్ల స్వల్పకాలంలోనే పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ ఎలా మారిందో ఎరికా బోగర్కింగ్కు మంత్రి కేటీఆర్ వివరించారు. ప్రగతిశీల విధానాలు, అద్భుత మౌలిక సదుపాయాలు, నైపుణ్యంగల శ్రామికశక్తి తెలంగాణలో ఉన్నందునే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. సీఎం కే చంద్రశేఖర్రావు దార్శనికతతో నేడు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుత పురోగతి సాధించిందని పేర్కొన్నారు. గత ఏడాది దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో 4.50 లక్షల ఉద్యోగాలు ఏర్పడితే, అందులో 1.5 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్లోనే వచ్చినట్టు తెలిపారు. డెలివరీ సెంటర్ ఏర్పాటుచేయాలన్న వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ నిర్ణయంతో టెక్ కంపెనీల గమ్యస్థానం హైదరాబాదే అన్న సంగతి మరోసారి స్పష్టమైందని అన్నారు. మాండీ హోల్డింగ్స్, స్టోరబుల్, రైట్ సాఫ్ట్వేర్, చార్లెస్ స్వాబ్ కార్పొరేషన్, రేవ్ గేర్స్, టెక్జెన్ తదితర సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
హైదరాబాద్లో డైనమిక్ బిజినెస్ ఎకో సిస్టమ్ ఉన్న కారణంగానే తాము అక్కడ డెలివరీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ తెలిపింది. మొదటి మూడేండ్లలో ఐదువేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది. హైదరాబాద్ అభివృద్ధిలో ఈ గ్లోబల్ సెంటర్ తనవంతు పాత్ర పోషిస్తుందని పేర్కొన్నది. వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ను 1998లో స్థాపించారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికా కాలిఫోర్నియాలోని లాస్ఏంజెల్స్లో ఉన్నది. ఈ సంస్థ ఉత్తర అమెరికా, ఆసియా, యూరప్, కరేబియన్లోని 42కిపైగా ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. ఇందులో ప్రస్తుతం 40 వేలకుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంస్థ ప్రపంచంలోని ప్రముఖ బ్రాండ్లకు కస్టమర్ కేర్, కస్టమర్ సొల్యూషన్స్ సేవలు అందించటంతోపాటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్వాలిటీ అష్యూరెన్స్, ఆటోమేషన్ తదితర విభాగాల్లో సేవలందిస్తున్నది. ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడిదారు బైన్ క్యాపిటల్ మద్దతుతో ఈ సంస్థ అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రైవేటు సంస్థల్లో ఒకటిగా పేరు సంపాదించింది.
వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ గ్లోబల్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ ఎరికా బోగర్కు జ్ఞాపికను అందజేస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు
మాండీ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈవో ప్రసాద్ గుండుమొగుల నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్ను కలిసింది. తెలంగాణలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ సెంటర్తో రెండువేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపింది. పర్యాటక రంగంలో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెడుతున్న ఈ సంస్థను ప్రసాద్ గుండుమొగుల 2011లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం టెక్సాస్లోని ఆస్టిస్లో ఉన్నది. ఈ సంస్థ అమెరికాలోని స్టాక్ ఎక్స్చేంజ్ నాస్డాక్లో లిస్ట్ అయ్యింది. ఈ సంస్థ ప్రస్తుతం పర్యాటక రంగంలో 3 బిలియన్ డాలర్ల మార్కెట్ను కలిగి ఉన్నది. అమెరికా, కెనడా, భారత్, థాయ్లాండ్, గ్రీస్ తదితర 17 దేశాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది.
తెలంగాణలో ఇప్పటికే గ్లోబల్ డెవలప్మెం ట్ సెంటర్ను కలిగి ఉన్న స్టోరబుల్ కంపెనీ మరిన్ని విస్తరణ ప్రణాళికలను మంత్రి కేటీఆర్ తో సమావేశం అనంతరం ప్రకటించింది. స్టోరబుల్కు చెందిన జొనాథన్ లూయిస్, నీల్ వర్మ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేటీఆర్తో సమావేశమై తమ విస్తరణ ప్రణాళికను వెల్లడించింది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్లో 41,000 స్టోరేజ్ సేవలను అందిస్తున్న ఈ టెక్ దిగ్గజం, హైదరాబాద్లో మొదట 100 మంది సాఫ్ట్వేర్ డెవలపర్లను నియమించుకోనున్నది. ఆ తర్వాత రిసెర్చ్ డెవలప్ మెంట్ కోసం మరికొంతమంది నిపుణులను నియమించుకుంటామని కంపెనీ తెలిపింది. తెలంగాణ అకాడమీ ఫర్ సిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)తోపాటు స్థానిక విద్యా సంస్థలతో కలిసి పనిచేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
రైట్ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్తో ఆదివారం సమావేశమైంది. హైదరాబాద్లో త్వరలో జరిగే డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ను ఆహ్వానించింది. ఈ కొత్త డెవలప్మెంట్ సెంటర్తో 500 మందికి ఉద్యోగావకాశాలు లభించడంతోపాటు రాష్ట్రంలోని పలు విద్యాసంస్థలతో కంపెనీకి భాగస్వామ్యం ఏర్పడుతుందని తెలిపింది. తెలంగాణలోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ కార్యకలాపాలను కొనసాగిస్తామన్న రైట్ సాఫ్ట్వేర్.. తమ విస్తరణ ప్రణాళికలను కేటీఆర్కు వివరించింది. త్వరలోనే వరంగల్ నగరంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
డిజిటల్ సొల్యూషన్స్, సైప్లె చైన్లో పేరొందిన టెక్జెన్ కంపెనీ బృందం మంత్రి కేటీఆర్ను కలిసి తెలంగాణలో వ్యాపారావకాశాలపై చర్చించింది. ఈ సందర్భంగా ప్రాడక్ట్ డెవలప్మెంట్, డిజైన్ థింకింగ్ కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు కంపెనీ ముందుకు వచ్చింది. ప్రతిపాదిత కేంద్రం టెక్జెన్స్ కార్యకలాపాలకు ఊతమిస్తుందని, వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందని సంస్థ ప్రెసిడెంట్ లక్ష్మి యనిగళ్ల, సీఈవో రఘు కొమ్మరాజు ఆశాభావం వ్యక్తంచేశారు.
బ్యాంకింగ్, కమర్షియల్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చార్లెస్ స్వాబ్ కార్పొరేషన్ ప్రతినిధి బృందం హ్యూస్టన్లో మంత్రి కేటీఆర్తో సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలతోపాటు ప్రభుత్వ విధానాలను వారికి కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. టెక్సాస్లోని వెస్ట్లేక్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ బహుళజాతి సంస్థను 1971లో స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థకు 400 బ్రాంచీలున్నాయి. 2022 నాటికి ఈ సంస్థ నిర్వహిస్తున్న క్లయింట్ల సంపద విలువ 7.05 లక్షల కోట్ల డాలర్లు. 3.38 కోట్ల బ్రోకరేజీ అకౌంట్లను నిర్వహిస్తున్నది.
టెక్సాస్కు చెందిన ‘రేవ్గేర్స్’ సంస్థ యాజమాన్యం హ్యూస్టన్లో మంత్రి కే తారకరామారావుతో సమావేశమై తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలపై చర్చించింది. కేటీఆర్తో సమావేశం అనంతరం తెలంగాణలో తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు రేవ్గేర్స్ ఆసక్తి వ్యక్తంచేసింది. ఈ సంస్థ అత్యంత నాణ్యమైన గేర్లు, షాఫ్టుల తయారీకి పేరెన్నికగన్నది.