హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): సుపరిపాలనలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలువటం గర్వంగా ఉన్నదని ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ర్యాంకుల్లో తెలంగాణ అనేక రంగాల్లో దేశంలో అగ్రస్థానంలో నిలవడంపై కేటీఆర్ ట్విట్టర్లో ఆదివారం స్పందించారు.‘ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో పరిశ్రమలు, వాణిజ్యం, సాంఘిక సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో సుపరిపాలన అందించడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడం గర్వకారణం. ఇవి భారత ప్రభుత్వం ద్వారా హోంమంత్రి అమిత్ షా విడుదలచేసిన ర్యాంకులు. గుడ్ గవర్నెన్స్ డే 2021’ అని ట్వీట్ చేశారు. అలాగే ‘తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యుటిలిటీస్ సెక్టార్పై దృష్టిసారించి సమ్మిళిత వృద్ధికి కృషి చేయడంతో ఎకనమిక్ గవర్నెన్స్ రంగంలో రెండో స్థానంలో నిలిచాం. అందుకే స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అత్యంత విజయవంతమైన స్టార్టప్ అని నేను ఎప్పుడూ చెప్తుంటా’ అని మరో ట్వీట్ చేశారు. కామర్స్ అండ్ ఇండస్ట్రీ సెక్టార్లో తొలిస్థానంలో నిలిచిన సందర్భంగా ‘సమర్థులైన సీనియర్ అధికారి జయేశ్రంజన్, పరిశ్రమ, వాణిజ్యశాఖ మొత్తం బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. గత ఏడేండ్లుగా మా ప్రయత్నాలకు మద్దతుగా నిలుస్తున్న పరిశ్రమ లీడర్లందరికీ కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ ర్యాంకింగ్లను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.