హైదరాబాద్ : ఎన్డీటీవీ ఫౌండర్, ప్రమోటర్ అయిన ప్రణయ్ రాయ్ ఆ ఛానల్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన భార్య రాధికా రాయ్ కూడా డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు. అయితే ఈ విషయంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్డీటీవీని అన్ఫాలో చేస్తున్నట్లు తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎన్డీటీవీ నిష్పాక్షిక సమాచారాన్ని ఇచ్చి బాగా పనిచేసిందని కేటీఆర్ తెలిపారు.
ఎన్డీటీవీలో మెజారిటీ షేర్లు ఇప్పటికే అదానీ గ్రూప్ దక్కించుకుంది. యాజమాన్యపు హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎన్డీటీవీ ప్రమోటింగ్ కంపెనీల్లో ఒకటైన ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ను అదానీ కొనుగోలు చేశారు. దాంతో ఎన్డీటీవీలో అదానీ గ్రూప్నకు 29.18 శాతం ఈక్విటీ వాటాగా లభించింది. అలాగే, బహిరంగ మార్కెట్ ద్వారా ఈ మీడియా సంస్థకు చెందిన మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. మొత్తంగా ఎన్డీటీవీలో ప్రస్తుతం అదానీ గ్రూప్ 55.18 శాతం వాటా దక్కించుకుంది. ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ డైరెక్టర్ పదవులకు రాజీనామా చేయడంతో.. సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగాలియా, సెంథిల్ సిన్నియ చెంగల్వరాయన్లను కొత్త డైరెక్టర్లుగా నియమించారు.
Unfollowing @ndtv
Thanks for the good work thus far 👍 https://t.co/7IsU6TljjJ
— KTR (@KTRTRS) November 30, 2022