హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్పై మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ఒక అహంకారి అని మాలిక్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. అమిత్ షా కూడా ప్రధానికి మతిపోయిందని వ్యాఖ్యానించినట్లు మాలిక్ ఆరోపించారు. ప్రస్తుతం మాలిక్ వ్యాఖ్యలు రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్నాయి.
గవర్నర్ సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఎన్డీఏ గవర్నమెంట్ అపాయింట్ చేసిన గవర్నర్ నోటి నుంచి ఈ మాటలు రావడం నిజంగా షాకేనని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాలిక్ వ్యాఖ్యల వీడియోను కేటీఆర్ షేర్ చేశారు.
మేఘాలయ గవర్నర్ సత్యపాలిక్ ఆదివారం (నిన్న) హర్యానాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. ‘ఇటీవల రైతుల సమస్యలపై మాట్లాడేందుకు నేను ప్రధానిని కలిశాను. ఈ సందర్భంగా కేవలం ఐదు నిమిషాల్లోనే ప్రధానిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చాలా అహంకారం ప్రదర్శించారు. మన రైతులు దాదాపు 500 మంది చనిపోయారు అని నేను ప్రస్తావిస్తుండగానే.. ‘వాళ్లు నాకోసం చనిపోయారా..?’ అంటూ ప్రధాని స్వరం పెంచారు’ అని చెప్పారు. ప్రధాని ప్రశ్నకు తాను అవును అని సమాధానం చెప్పానని మాలిక్ పేర్కొన్నారు. మీరు రాజు కాబట్టి రైతుల మరణాలకు మీరే బాధ్యులని చెప్పానని తెలిపారు. తర్వాత ప్రధాని తనకు హోంమంత్రి అమిత్షాను కలిసి మాట్లాడమని చెప్పారని, ఆయన చెప్పినట్లే తాను అమిత్ షాను కలిశానని అన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా ప్రధానిని ఉద్దేశించి ‘సత్యా ఆయనకు మతి తప్పింది’ అని వ్యాఖ్యానించినట్లు ఆరోపించారు. కుక్క చచ్చినా సంతాప లేఖ పంపే ప్రధాని రైతుల మరణాలపై స్పందించలేదని విమర్శించారు. ఇక ప్రధానితో పోరాటానికి స్వస్తి పలుకుతున్నానని అన్నారు.