హైదరాబాద్: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు (Minister KTR) నేడు ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో ప్రతిమ ఫౌండేషన్ (Prathima Foundation) ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. ఆతర్వాత మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా తొర్రూరు (Thorrur) చేరుకుంటారు. మహిళా దినోత్సవ (Women’s day) కానుకగా రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకు మొత్తం రూ.750 కోట్ల వడ్డీలేని రుణాలను, అభయహస్తం డబ్బులను చెక్కుల రూపంలో పంపిణీ చేయనున్నారు. 500 మందికి ఉచితంగా కుట్టుమిషన్లు అందిచనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు
తొర్రూరు పట్టణంలో రూ.2కోట్ల13లక్షలతో నిర్మించిన యతిరాజారావు చిల్డ్రన్స్పార్, రూ.4కోట్లతో నిర్మించిన సమీకృత మారెట్ యార్డును మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. రూ.8కోట్ల75లక్షలతో నిర్మించే ఇండోర్ స్టేడియం, డివైడర్ పనులకు శంకుస్థాపన చేస్తారు. యతిరాజారావు పార్క్ ఆవరణలో రూ.5కోట్లతో ఇండోర్ స్టేడియం, ప్రస్తుతం ఉన్న గ్రోమోర్ కేంద్ర సమీపం నుంచి పాలకేంద్రం వరకు డివైడర్ కోసం రూ.2.75కోట్లు కేటాయించారు.
గులాబీమయమైన తొర్రూరు
మంత్రి కేటీఆర్కు ఘనస్వాగతం పలికేందుకు మంత్రి దయాకర్రావు సూచనలతో బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తమయ్యారు. పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, దయాకర్రావు, సత్యవతి రాథోడ్ చిత్రపటాలతో కూడిన కటౌట్లు, ఫ్లెక్సీలు, గులాబీ జెండాలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 20వేల మంది మహిళలు తొర్రూరులో నిర్వహించే మహిళా దినోత్సవ వేడుకలకు తరలివస్తున్న తరుణంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించారు. మహిళల భాగస్వామ్యంతోనే భారీ ర్యాలీ కొనసాగేలా ఏర్పాట్లు చేశారు.