వరంగల్ : ఈ నెల 27న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని వేలేరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చిల్పూరు, వేలేరు, ధర్మసాగర్ మండలాల్లోని కరువు పీడిత గ్రామాలకు సాగునీరందించేందుకు రూ.133కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన ఇరిగేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. కేటీఆర్ పర్యటన విజయవంతం కోసం పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే టీ రాజయ్య, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, జడ్పీ చైర్మన్లు సంపత్ రెడ్డి, సుధీర్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ తీవ్ర కరువుతో కొట్టుమిట్టాడుతున్న స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ, ప్రత్యేకించి వేలేరు, చిల్పూరు, ధర్మసాగర్ మండలాల రైతులకు సాగునీరు అందించే ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నం, మంత్రి కేటీఆర్ చొరవతో నిధులు మంజూరు కావడం, శంకుస్థాపన చేసేందుకు కేటీఆర్ రావడం హర్షించదగ్గ విషయమన్నారు. పర్యటన విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లు, జనసమీకరణపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆయా విభాగాల వారీగా ఇన్చార్జిలను నియమించారు. మండలాలకు ఇన్చార్జిలుగా జాఫర్గఢ్, మార్నెని రవీందర్రావు, స్టేషన్ ఘన్పూర్కు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రఘునాథపల్లికి రుణ విమోచన కార్పొరేషన్ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు, లింగాల ఘనపురానికి ఆర్ అండ్బీ సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, ధర్మ సాగర్కు కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, వెలేరుకు దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, చిల్పూర్కు జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి , భీమదేవరపల్లికి హనుమకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ నియమించారు. సమన్వయకర్తలుగా ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య వ్యవహరించనున్నారు.