నల్లగొండ : ఈ నెల 14న రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియా, నందికొండ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా హాలియా పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్తో కలిసి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఏర్పాట్లను పరిశీలించారు.
బుధవారం కలెక్టర్, ఎమ్మెల్యే, మిర్యాల ఆర్డీవో అధికారులతో కలిసి మిర్యాలగూడ రహదారిలో హెలీపాడ్, పట్టణంలోని మినీ స్టేడియంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, సభ ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. అనంతరం నందికొండ పట్టణంలో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలుర పాఠశాల ఆవరణ, పెద్దవూర మండలం సుంకిశాలలో హెలీపాడ్ కోసం స్థల పరిశీలన చేశారు.
ఆ తర్వాత సుంకిశాల నుంచి నాగార్జున సాగర్ రిజర్వాయర్ ద్వారా కృష్ణా మంచినీటి పథకం కింద హైదరాబాద్ పట్టణానికి కృష్ణ జలాల సరఫరాకు ఇంటెక్ వెల్ స్టేషన్ నిర్మాణ పనులకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. వారి వెంట ఆర్డీవో రోహిత్ సింగ్, ఆర్ అండ్బీ ఈఈ నరేందర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ రాంచంద్రనాయక్, మున్సిపల్ కమిషనర్ వేమారెడ్డి, తహశీల్దార్ మంగ పాల్గొన్నారు.