హైదరాబాద్ : వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్తో నిరుద్యోగ యువత ఉపాధి లభిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ నెల 7న పరకాల నియోజకవర్గం చింతలపల్లిలో కైటెక్స్ మెగా టెక్స్టైల్ పార్క్కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా పార్క్ను మంత్రి బుధవారం సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. టెక్స్టైల్ పార్క్ స్థలాన్ని, పరిశ్రమ పని చేస్తున్న విధానాన్ని, ఉత్పత్తిని తదితర పరిశీలించడంతో పాటు అధికారులతో మాట్లాడి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వరంగల్లో అజంజాహి మిల్లు ద్వారా అనేక మందికి ఉపాధి లభించేదని మంత్రి పేర్కొన్నారు.
ఆ నాటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా మిల్లు మూతపడిందని, చివరకు ఆ మిల్లు స్థలాలను కూడా అమ్ముకున్నారన్నారు. గత చరిత్రను మరిచిపోయేలా సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని కైటెక్స్ మెగాటెక్స్టైల్ కంపెనీ వరంగల్ విధంగా చర్యలు తీసుకున్నారన్నారు. మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్కు తెచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఇక్కడి ప్రజలు రుణపడి ఉంటారన్నారు. ఈ నెల 7న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగనుందని, పార్క్ నిర్మాణం పూర్తయితే ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.
2500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మందికి కంపెనీ ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రీసైక్లింగ్ కారణంగా మరికొందరికి ఉపాధి లభిస్తుందన్నారు. మెగా పార్క్ నిర్మాణానికి స్థలాలను ఇచ్చిన రైతులకు ఒక్కొక్కరికి ఎకరాకు వంద గజాల స్థలం పార్క్ లోపలే ఇస్తున్నామని, త్వరలోనే కార్యక్రమాన్ని అధికారులు పూర్తి చేస్తారన్నారు. దీంతో 48 మంది రైతులకు పునరావాసం లభించనుందని, పార్క్లో ఉత్పత్తి కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయని, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మంత్రి వెంట పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, కలెక్టర్ గోపి, ఆయాశాఖల అధికారులు, కైటెక్స్ మెగా టెక్స్టైల్ పార్క్ అధికారులు ఉన్నారు.